ఇక ‘రాకెట్ బాంబులు’!.. రూపకల్పనలో భారత వాయుసేన!
శత్రుదేశాల స్థావరాలను బాంబులతో పేల్చేస్తుంది సైన్యం. ఆ బాంబులను నిర్దేశిత లక్ష్యాలపై జారవిడిచేందుకు రాకెట్లను ఉపయోగిస్తారు. మరి రాకెట్ ఇంధనాన్ని కూడా బాంబుగా మార్చేస్తే.. ?
న్యూఢిల్లీ: శత్రుదేశాల స్థావరాలను బాంబులతో పేల్చేస్తుంది సైన్యం. ఆ బాంబులను నిర్దేశిత లక్ష్యాలపై జారవిడిచేందుకు రాకెట్లను ఉపయోగిస్తారు. మరి రాకెట్ ఇంధనాన్ని కూడా బాంబుగా మార్చేస్తే.. ?
ఇప్పుడు ఇదే వ్యూహంతో ద్వంద వినియోగ రాకెట్ ఇంధనంపై పరిశోధన చేస్తోంది భారత వాయుసేన. అంటే బాంబులతో పాటు రాకెట్ కూడా పేలిపోవటంతో మరింత శక్తివంతమైన పేలుడు సంభవిస్తుంది.
ఫలితంగా తక్కువ సమయంలోనే శత్రువుల స్థావరాలను నామరూపాల్లేకుండా చేసి కోలుకోలేని దెబ్బకొట్టవచ్చు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై వాయుసేన విస్త్రృత పరిశోధనలు చేస్తోంది.
ఈ ఆలోచన ఇప్పటిది కాదు.. గతంలోనూ ద్వంద్వ వినియోగ ఇంధన రాకెట్లను పలు సందర్భాల్లో వినియోగించారు. ప్రాజెక్టు మొదటి దశలో భాగంగా ద్వంద్వ వినియోగ ఇంధన ఫార్ములా రూపొందించాల్సిందిగా కాంట్రాక్టర్లను ఆహ్వానించింది.
1982లో ఇంగ్లండ్, అర్జెంటీనా మధ్య జరిగిన ఫాక్లాండ్స్ యుద్ధంలో హెచ్ఎంఎస్ షెఫీల్డ్ యుద్ధ నౌకపై రాకెట్ బాంబులతో అర్జెంటీనా దాడి చేసింది. బాంబులతో పాటు రాకెట్ ప్రొపెల్లెంట్ కూడా పేలిపోవటంతో భారీ విధ్వంసం జరిగి యుద్ధనౌక సముద్రంలో మునిగిపోయింది.
ప్రస్తుత కాలంలో ఆయుధాలు తక్కువ పరిమాణంలో ఉండి తక్కువ సమయంలో ఎక్కువ విధ్వంసం సృష్టించేలా ఉండాలి. అలాంటి ఆయుధాలపైనే ప్రపంచ దేశాలు దృష్టిపెట్టాయి. ఈ నేపథ్యంలోనే రాకెట్ బాంబులను రూపొందించే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై భారత వాయుసేన దృష్టిపెట్టింది.