అప్పటి వరకు రోహింగ్యాలను పంపొద్దు: సుప్రీం కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: రోహింగ్యా ముస్లిం శరణార్థుల విషయం సున్నితమైన అంశమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తమను దేశం నుంచి పంపించ వద్దని వేసిన పిటిషన్ను శుక్రవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. కీలక వ్యాఖ్యలు చేసింది.
ఈ కేసు విషయంలో దేశ భద్రతను రెండో ప్రాధాన్యత కింద తీసుకోలేమని.. అదే విధంగా రోహింగ్యాల మానవ హక్కులను దృష్టిలో ఉంచుకోవాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. రోహింగ్యాల విషయంలో రాష్ట్రాలది కీలక పాత్రని కోర్టు వ్యాఖ్యానించింది. కేసు తదుపరి విచారణను నవంబరు 21కి వాయిదా వేసింది.
అప్పటి వరకు రోహింగ్యాలను దేశం నుంచి పంపించే ప్రయత్నాలు చేయొద్దని అధికారులకు సూచించింది. రోహింగ్యాల తరలింపు విషయంలో కేంద్రం ఏమైనా ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంటే.. వాటిని తప్పకుండా న్యాయస్థానానికి తెలియజేయాల్సిందిగా కోరింది.
రోహింగ్యాలు దేశ భద్రతకు ముప్పు అని, శరణార్థుల్లో కొంతమందికి ఐసిస్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని కేంద్రం ఆరోపించిన విషయం తెలిసిందే. అందుకే వాళ్లని దేశం నుంచి పంపించి వేస్తున్నట్లు కేంద్రం గతంలో న్యాయస్థానానికి తెలియజేసింది. ఈ నేపథ్యంలోనే రోహింగ్యాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.