ధాన్యం కొనుగోళ్లలో భారీ స్కాం: రూ.1500 కోట్ల అవినీతి..? నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్
రాష్ట్రంలో జరుగుతోన్న ధాన్యం కొనుగోళ్లలో భారీ స్కాం జరిగిందని ఆరోపించారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. రూ.వెయ్యి నుంచి రూ.1500 కోట్ల వరకు అవినీతి జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ సందర్భంగా పేదలను ఆదుకునేందుకు పేదలకు రేషన్ కార్డుపై 5 కిలోల బియ్యం, కిలో కంది పప్పు అందిస్తోందని పేర్కొన్నారు. అంత్యోదయ కార్డు ఉన్నవారికి 35 కిలోల బియ్య అందజేస్తుందని తెలిపారు.
నిజామాబాద్ జిల్లాలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ అర్వింద్ గుర్తుచేశారు. కానీ మంత్రి ప్రశాంత్ రెడ్డి మాత్రం స్పందించడం లేదని పేర్కొన్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైస్ మిల్లర్ల కడ్తా పేరుతో రైతులను మోసం చేస్తున్నారని తెలిపారు. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే రూ.120 కోట్ల నుంచి రూ.130 కోట్ల వరకు స్కాం జరుగుతోందని తెలిపారు. రైతుల ధాన్యం కడ్త లేకుండా వందశాతం కొనుగోలు చేయాలని కోరారు. దానిని కేంద్రప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు.
లాక్డౌన్ సమయంలో పేదల కోసం తెలంగాణ రాష్ట్రానికి రూ.599 కోట్లు అందజేసిందని గుర్తుచేశారు. ఆ నిధుల్లో నిజామాబాద్ జిల్లాకు ఎంతమొత్తం కేటాయించారు అని ప్రశ్నించారు. ఆ నిధులు లెక్క ప్రజలకు చెప్పాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్పై అర్వింద్ విరుచుకుపడ్డారు. సిరిసిల్ల రైతులతో ధాన్యం కుప్పలను కాలుస్తున్నారని గుర్తుచేశారు. రైతుల గురించి మాట్లాడకుండా ఐటీ కంపెనీల గురించి మాట్లాడటం సరికాదని చెప్పారు.
హైదరాబాద్ ఐటీ కంపెనీలు.. ఇప్పుడే రావడం లేదు అని చెప్పారు. గత 30 ఏళ్ల నుంచి వస్తున్నాయని పేర్కొన్నారు. ఇందులో మంత్రి కేటీఆర్ ఘనత ఏం లేదు అని చెప్పారు. ఐటీ గురించి కాక.. రైతుల గురించి పట్టించుకోవాలని కోరారు. ఐటీ గురించి కేంద్ర ప్రభుత్వం పట్టించుకుంటుందని తెలిపారు.