ఎన్నికల మహత్యం.. 2వేల నోటు మాయం..
పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆర్బీఐ ప్రవేశపెట్టిన 2వేల రూపాయల నోటుతో జనం పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఆ నోటుకు చిల్లర దొరకక పడ్డ టెన్షన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అలాంటి పెద్ద నోటు ఇప్పుడు మార్కెట్లో కనిపించకుండా పోయింది. ఇంతకీ 2వేల నోటు ఏమైంది? ఎక్కడికి మాయమైంది?
అరుణాచల్లో ఓటుకు నోటు! సీఎం కాన్వాయ్లో కోట్ల కట్టలు!
రెండు వేల నోటు మాయం
దేశంలో చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం రెండు వేల రూపాయల నోట్లు కనిపించకుండా పోయాయి. బ్యాంకుకెళ్లినా, ఏటీఎంలో విత్ డ్రా చేసినా ఇప్పుడు పెద్ద నోటు రావడం లేదు. ఒకప్పుడు ఏటీఎంలో 2వేల రూపాయల నోటు వస్తుందేమోనని టెన్షన్ పడ్డవారికి ఇప్పుడు ఆ ఆందోళన తగ్గింది. అయితే రూ.500, వంద నోట్లు మాత్రమే అందుబాటులో ఉండటంతో బ్యాంకు ఏటీఎంలు తొందరగా ఖాళీ అవుతున్నాయి.
సార్వత్రిక ఎన్నికల ప్రభావం
లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత రెండువేల రూపాయల నోటు పత్తా లేకుండా పోయిందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. వాస్తవానికి ఆర్బీఐ 2వేల రూపాయల నోటు ప్రింటింగ్ నిలిపివేసింది. అయితే ఇప్పటికే భారీ మొత్తంలో మార్కెట్లో సర్క్యులేషన్లో ఉన్న పెద్ద నోట్లు ఏమయ్యాయన్నది అంతు చిక్కని ప్రశ్నగా మారింది. ఎన్నికల నేపథ్యంలో రెండు వేల నోట్లు నాయకుల ట్రంకు పెట్టెల్లో దాక్కున్నాయని మార్కెట్ నిపుణులు అంటున్నాయి. పెద్ద నోటు క్రమంగా కనుమరుగవుతుండటంతో అవన్నీ బ్లాక్ మనీ రూపంలో పోగవుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మార్కెట్లో తగ్గిన చలామణి
2017లో రూ.3,285 మిలియన్ల రెండు వేల రూపాయల నోట్లు చలామణిలో ఉండగా.. 2018 నాటికి ఆ సంఖ్య 3, 363 కోట్లకు పెరిగింది. అదే 2018 వచ్చే సరికి 2వేల రూపాయల నోట్ల సంఖ్య పెరగకపోగా.. గణనీయంగా తగ్గిందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.
ఏటీఎంల రీక్యాలిబరేషన్
పెద్దనోట్ల రద్దు తర్వాత 2వేల రూపాయల నోటు మార్కెట్ను ముంచెత్తడంతో అందుకు తగ్గట్లుగా ఏటీఎంలను రీక్యాలిబరేట్ చేశారు. కానీ ఇప్పుడు రెండు వేల నోట్ల సంఖ్య తగ్గిపోవడం, 500, 100 రూపాయల నోట్లు మాత్రమే అందుబాటులో ఉండటంతో ఏటీఎంలు త్వరగా ఖాళీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో 200 రూపాయల నోట్లకు సరిపడేలా ఏటీఎంలలో మార్పులు చేసేందుకు బ్యాంకులు సన్నద్ధమవుతున్నాయి.