నడి రోడ్డులో రూ. 58 లక్షలు లూటీ: దర్జాగా పరార్
థానే: నడి రోడ్డు మీద అందరూ చూస్తున్న సమయంలో మారణాయుధాలతో బెదిరించి రూ. 58 లక్షలు లూటీ చేసిన సంఘటన మహారాష్ట్రలోని థానేలో జరిగింది. నగదు లూటీ చేసిన దుండగుల కోసం ప్రత్యేక బృందాలతో గాలించినా చేసినా ఫలితం లేకుండా పోయింది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం మద్యాహ్నాం థానే జిల్లాలోని బాంబి వ్యాలీలో ర్యాలీ నిర్వహించారు. తరువాత థానే మీదుగానే ఆయన ప్రయాణించారు. మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు థానే నగరంలోని వివిధ రైల్వే స్టేషన్లలో టిక్కెట్లు విక్రయించగా వచ్చిన నగదు సేకరించారు.
తరువాత రైల్వే సిబ్బంది సెక్యూరిటి గార్డుతో పాటు నగదు తీసుకుని వ్యాన్ లో బయలుదేరారు. మార్గం మధ్యలో కల్యాణ్-షిల్ రహదారిలోని నిల్జీ రైల్వే స్టేషన్ సమీపంలో 7 మంది దుండగులు వ్యాన్ ను అడ్డగించారు. మారణాయుధాలతో వ్యాన్ లో ఉన్న వారిని బెదిరించారు.
అందరూ చూస్తున్నా లెక్కచెయ్యని దుండగులు క్షణాలలో వ్యాన్ లో ఉన్న రూ. 58 లక్షలు లూటీ చేసి తాము వచ్చిన తెలుపు రంగు కారులో అక్కడి నుంచి దర్జాగా వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు నాకాబందీ కొనసాగించినా ఫలితం లేదు.
అయితే దుండగులు వచ్చిన తెలుపు రంగు కారు మాత్రం ఊరి చివరిలో వదిలి పెట్టి వెళ్లారని, దానిని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ పరాగ్ మనీరే తెలిపారు. అయితే ఆ కారు చోరీ చేసి ఉంటారని థానే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.