ఎన్నికల నజరానా: రూ. 60 కోట్లు సీజ్ చేశారు
న్యూఢిల్లీ: ఐదు రాష్ర్టాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు పంపిణి చేస్తున్నారు. శాసన సభ ఎన్నికలు జరుగుతున్న రాష్ర్టాల్లో అక్రమంగా తరలిస్తున్న డబ్బును ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
దాదాపు రూ. 60 కోట్ల రూపాయలు తాము సీజ్ చేశామని ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఇప్పటికే అసోంలో ఎన్నికలు పూర్తి అయ్యాయి. పశ్చిమ బెంగాల్ లో రెండో విడత పోలింగ్ ముగిసింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఎన్నికలు జరగవలసి ఉంది.
ఎన్నికలు జరుగుతున్న రాష్ర్టాల్లో అధికారులు నిఘా వేశారు. తమిళనాడులో ఎక్కువ మొత్తంలో డబ్బును అధికారులు సీజ్ చేశారు. తమిళనాడులో రూ. 24.55 కోట్లు, అసోంలో రూ.12.33 కోట్లు, పశ్చిమ బెంగాల్ లో రూ. 12.14 కోట్లు, కేరళలో రూ. 10.41 కోట్లు, పుదుచ్చేరిలో రూ. 60.88 లక్షలు స్వాధీనం చేసుకున్నామని అధికారులు చెప్పారు.
కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వడ్ లు ఐదు రాష్ర్టాల్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ర్టాల్లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే మార్చి 4 నుంచి కోడ్ అమల్లోకి వచ్చింది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో మే 16న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి.