గాలి నోట్ల మార్పిడి: డ్రైవర్ ఆత్మహత్య కేసులో ట్విస్ట్
గాలి జనార్దన్ రెడ్డి నోట్ల మార్పిడి కేసు మరో మలుపు తిరిగింది. భీమా నాయక్కు, రమేష్ గౌడకు మధ్య రూ.8 లక్షల విషయంలో వివాదం తలెత్తినట్లు చెబుతున్నారు.
బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి తన కూతురు బ్రాహ్మణి పెళ్లి కోసం నోట్లను మార్పిడి చేసుకున్న కేసు మరో మలుపు తిరిగింది. ఆ మార్పిడి వ్యవహారంలో బెంగళూర్ భూవిస్తరణ ప్రత్యేకాధికారి భీమా నాయక్ డ్రైవర్ రమేష్ గౌడ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో మాండ్యా పోలీసులు ఓ వ్యక్తిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
డ్రైవర్ ఆత్మహత్యతో గాలికి ఉచ్చు: కూతురు పెళ్లి కోసం రూ.100 కోట్ల మార్పిడి
ప్రసాద్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం రమేష్ గౌడ సన్నిహిత మిత్రుడు సురేష్ను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నట్లు జాతీయ పత్రికల్లో వార్తలు వచ్చాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ, నోట్ల మార్పిడి రాకెట్లోనూ రమేష్ గౌడ భీమా నాయక్కు సహకరించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
గాలి కథ ఖతమ్ ? డెత్ నోట్ లో ఏముందంటే
భీమా నాయక్కు, రమేష్కు మధ్య 8 లక్షల రూపాయల విషయంలో వివాదం తలెత్తినట్లు చెబుతున్నారు. దాంతో రమేష్ గౌడపై కొంత మంది మనుషులు దాడి చేశారని అంటున్నారు. సురేష్ను కీలకమైన సాక్షిగా చేర్చేందుకు దర్యాప్తు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, దర్యాప్తు నిమిత్తం మద్దూరు పోలీులు నాయక్ ఇంటికి, కార్యాలయానికి వెళ్లారు.
అజ్ఞాతంలోకి వెళ్లిన నాయక్....
విచారణ నిమిత్తం తమ ముందు హాజరు కావాలని భీమా నాయక్కు పోలీసులు నోటీసు జారీ చేసఆరు. అయితే, అతను హాజరు కాలేదు. అతను అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. నాయక్, రమేష్ గౌడ, వారి బంధువుల బ్యాంకు లావాదేవీలను పోలీసులు పరిశీలించారు. నాయక్ పని చేసిన బెంగళూరు, బళ్లారి జిల్లాల్లోని ప్రాంతాలను పోలీసులు సందర్శించారు.
అనుమతి కోసం దరఖాస్తు...
నాయక్ ఇళ్లలో, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ పోలీసులు కోర్టు అనుమతి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. రమేష్ గౌడ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించిన వ్యక్తిగా ఆరోపణలు ఎదుర్కుంటున్న భీమా నాయక్ బెయిల్ కోసం మాండ్యా సెషన్స్ కోర్టులో దరఖాస్తు చేసుకున్నాడు. నాయక్ మరో డ్రైవర్ మొహమ్మద్ పేరును కూడా రమేష్ తన సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. మొహ్మద్ కూడా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. రెండు బెయిల్ పిటిషన్లు కూడా డిసెంబర్ 14వ తేదీన కోర్టులో విచారణకు వస్తున్నాయి.
పోలీసులు నోటీసులు పంపించారు...
రమేష్ గౌడ ఆత్మహత్య కేసులో నిందితుడైన భీమా నాయక్ పనిచేసిన రెవెన్యూ శాఖకు, యెలహంకలోని ఆయన నివాసానికి మద్దూరు పోలీసులు నోటీసులు పంపించారు. సహ నిందితుడు మొహ్మద్కు కూడా నోటీసులు జారీ చేశారు. వారిద్దరు ఎక్కడు దాక్కున్నారనే విషయం ఇప్పటి వరకు పోలీసులకు తెలియదు. వారి ఆచూకీ తెలి్స్తే వెంటనే తమకు తెలియజేయాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఆ ఇద్దరి సహోద్యోగులను, కుటుంబ సభ్యులను ఆదేశించారు.
రమేష్ సూసైడ్ నోట్ అధ్యయనం
రమేష్ రాసిన సూసైడ్ నోట్లోని విషయాలను పోలీసులు క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. తగిన సాక్ష్యాధారాలను సేకరిస్తున్నారు. నాయక్ మూడు నెలలుగా తనకు వేతనం చెల్లించలేదని రమేష్ గౌడ తన సూసైడ్ నోట్లో రాశాడు. సాక్ష్యం కోసం అతని పేస్లిప్లను పోలీసులు సేకరించారు. పోలీసులు ప్రస్తుతం ఆత్మహత్యకు ప్రేరేపించిన విషయంలోనే దర్యాప్తు చేస్తున్నారు తప్ప మనీ లాండరింగ్ విషయాన్ని పరిశీలించడం లేదు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని తాము ఎసిబి అందించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఎఫ్ఐఆర్లో మనీ లాండరింగ్ అంశాలు చేర్చాలా, వద్దా అనే విషయంపై ఎసిబి అధికారులు నిర్ణయం తీసుకుంటారు.