కర్ణాటక ఎన్నికల్లో ప్రలోభాలు: స్కార్పియోలో రూ.2.17కోట్లు తరలిస్తుండగా సీజ్!
బెంగళూరు: కర్ణాటక ఎన్నికలవేళ భారీ ఎత్తున ప్రలోభ పర్వాలు మొదలైనట్టు తెలుస్తోంది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పలు పార్టీలు భారీగా డబ్బు పంపిణీ చేపట్టే పనిలో నిమగ్నమయ్యాయి. గురువారం నాటితో ఎన్నికల ప్రచారం ముగియడంతో.. ఇక ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వ్యక్తిగతంగా వారిని ప్రలోభ పెడుతున్నాయి పార్టీలు.
ఈ నేపథ్యంలో చిత్రదుర్గ జిల్లా మొలకల్మూరులోని ఎద్దలబొమ్మనహట్టి వద్ద ఓ స్కార్పియో వాహనంలో రూ.2.17కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ డబ్బును మొలకల్మూరుకు తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కాగా, కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఐటీ, పోలీసు, అబ్కారీ శాఖల తనిఖీల్లో రూ.80.91కోట్ల నగదు, రూ.24.36 కోట్ల విలువైన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రూ.44.26కోట్ల విలువైన బంగారంతో వెండితో పాటు రూ.176 కోట్ల నగదును ఐటీ శాఖ జప్తు చేసింది.
ఇదిలా ఉంటే, కర్ణాటకలోని మొత్తం 224 నియోజకవర్గాల్లో 223నియోజకవర్గాలకు మే 12న ఎన్నికలు జరగనున్నాయి. బెంగళూరులోని జయానగర్ అభ్యర్థి విజయకుమార్ అకాల మరణంతో అక్కడ ఎన్నిక వాయిదా పడింది.












Click it and Unblock the Notifications