ఆ సీఎంను చంపితే కోటి బహుమానం: ఆర్ఎస్ఎస్ నేత సంచలనం..
సీఎం విజయన్ ను చంపితే చంపినవాళ్లకు కోటి రూపాయలు బహుమానంగా ఇస్తానని ఆర్ఎస్ఎస్ ప్రముఖ్ చంద్రావత్ ప్రకటించారు.
ఉజ్జయిని: కేరళ సీఎం పినరయి విజయన్ పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మధ్యప్రదేశ్ ఆర్ఎస్ఎస్ నాయకుడు డాక్టర్ చంద్రావత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం విజయన్ ను చంపితే చంపినవాళ్లకు కోటి రూపాయలు బహుమానంగా ఇస్తానని ప్రకటించారు. విజయన్ తల కోసం అవసరమైతే తన ఆస్తినైనా సరే అమ్మేస్తానని తెలిపారు.
ఉజ్జయినిలో ఆర్ఎస్ఎస్ ప్రముఖ్ గా ఉన్న చంద్రవాత్ స్థానికంగా జరిగిన ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రావత్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు ఎంపీ చింతామణి మాలవీయ, ఎమ్మెల్యే మోహన్ యాదవ్ లు అక్కడే ఉండటం గమనార్హం.
కాగా, ఆర్ఎస్ఎస్ తీరును తప్పుబడుతూ ఇటీవల కేరళ సీఎం విజయన్ పలు వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ హిట్లర్, ముస్సోలిని లాంటి నియంతలను అనుసరిస్తోందంటూ మండిపడ్డారు.దేశాన్ని చీల్చేందుకు ఆర్ఎస్ఎస్ కుట్ర పన్నుతున్నట్లుగా విజయన్ వ్యాఖ్యానించారు. మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సే కూడా ఆర్ఎస్ఎస్ చేతుల్లోని ఆయుధమేనని వ్యాఖ్యానించారు.
కాగా, విజయన్ అధికారం చేపట్టిన తర్వాత ఆ రాష్ట్రంలో ఎనిమిది మంది బీజేపీ నేతలు మరణించారు. దీంతో బీజేపీ, దాని అనుబంధ నాయకులు ఆయన్ను టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.