సుదీర్ఘ కాలం అక్కర్లేదు: ఆర్ఎస్ఎస్ (ఫొటోలు)
బడుగు వర్గాలకు రాజ్యాంగం కల్పిస్తున్న రిజర్వేషన్లపైన మరోసారి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కన్నుబడింది. దేశ రాజకీయాల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ.
న్యూఢిల్లీ: బడుగు వర్గాలకు రాజ్యాంగం కల్పిస్తున్న రిజర్వేషన్లపైన మరోసారి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కన్నుబడింది. దేశ రాజకీయాల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మరో 20 రోజుల ముందే సంఘ్ స్పందించడం గమనార్హం.
గతంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ముందు ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ సంచాలక్ మోహన్ భగవత్.. రిజర్వేషన్లను సమీక్షించాలని పిలుపునిస్తే.. ఈ దఫా అధికార ప్రతినిధి మన్మోహన్ వైద్య వంతైంది. రాజస్థాన్ రాజధాని జైపూర్ నగరంలో జరుగుతున్న సాహితీ ఉత్సవంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వసుంధరా రాజె సింధియా సహా పలువురు అధికార ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో మన్మోహన్ వైద్య మాట్లాడారు.
రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల వల్ల సామాజిక, ఆర్థిక వివక్షను ఎంతవరకు అంతమొందించిందన్న అంశాన్ని సమీక్షించాల్సి ఉన్నదని ఆయన అన్నారు.
రిజర్వేషన్లే వద్దు..
సుదీర్ఘ కాలం రిజర్వేషన్లు అమలుచేయాల్సిన అవసరమే లేదని మన్మోహన్ వైద్య అన్నారు. దీనికి ముస్లింల సామాజిక, ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీలు భిన్నమైన వారంటూనే ఎక్కువ కాలం అందరికీ రిజర్వేషన్లు అవసరమే లేదన్నారు. బీహార్, బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ముస్లింలు 70 శాతం మంది ఉంటారని, వారిలో అత్యధికులు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వారేనని, వారి పరిస్థితిని అర్థం చేసుకోవాలన్నారు. లిటటరీ ఫెస్టివల్లో ఆయన చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు భగ్గుమన్నారు. నెటిజన్ల ఆగ్రహ జ్వాలలతో వైద్య ఆఘమేఘాలపై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
ఇలా వివరణ ఇచ్చారు....
నుంచి సామాజిక వివక్ష తొలగిపోయే వరకూ రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంటుంది' అని తన వ్యాఖ్యలకు అర్థమని వైద్య వివరణ ఇచ్చుకున్నారు. ‘సమాజంలో వివక్ష కొనసాగే వరకు రిజర్వేషన్ అమలుచేయాలి. సాధ్యమైనంత త్వరగా వివక్షకు చరమగీతం పాడాలి. నిరుపేదలు రిజర్వేషన్ల ఫలాలు పొందాలి. కానీ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇన్నేళ్లకు కూడా బడుగు వర్గాలకు రిజర్వేషన్ల ఫలాలు ఎందుకు అందలేదో మనం పరిశీలించుకోవాల్సి ఉంది' అని తేల్చి ట్వీట్ చేశారు. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందన్నారు.
అసమానత్వం తొలగిపోయే వరకూ బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. కానీ మత ప్రాతిపదికన రిజర్వేషన్ల అమలుకు మాత్రమే తాను వ్యతిరేకమని పేర్కొన్నారు. గత ఏడు దశాబ్దాల కాలంలో రిజర్వేషన్ల వల్ల ఎంత మంది నిరుపేదలు లబ్ది పొందారన్న విషయమై సమీక్షించాల్సి ఉన్నదని మాత్రమే చెప్పానన్నారు. తన వ్యాఖ్యల ప్రభావం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉండదన్నారు.గతేడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా నెల రోజుల ముందు ఆర్ఎస్ఎస్ వార్తా పత్రికలు ఆర్గనైజర్, పాంచజన్యలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ సంచాలక్ మోహన్ భగవత్ రిజర్వేషన్ల పట్ల తమ మనోగతం బయటపెట్టారు.
ఎంతకాలం అమలు చేయాలో పరిశీలించాలి
సంఘ్ పరివార్ సిద్ధాంతవేత్త దీన్ దయాళ్ ఉపాధ్యాయ సిద్ధాంతమే సమగ్ర మానవత్వం అని పేర్కొంటూ ‘రాజ్యాంగ నిర్మాతలు రూపొందించిన రిజర్వేషన్ల అమలు వల్ల ఎంతమంది నిజమైన వారికి లబ్ది చేకూరిందన్న విషయంతోపాటు సామాజిక అసమానతల తొలగింపునకు ఎంత కాలం రిజర్వేషన్లు అమలుచేయాలో సమీక్షించేందుకు కమిటీని వేయాలి. ఏయే వర్గాలకు ఇంకా రిజర్వేషన్లు అవసరమో నిర్ధారించాలి. ఈ కమిటీలో సమాజంలోని ప్రతినిధులను కూడా నియమించుకోవచ్చు' అని మోహన్ భగవత్ చెప్పారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో ప్రస్తుతం అమలుచేస్తున్న రిజర్వేషన్ల విధానానికి వ్యతిరేకంగా మోహన్ భగవత్ మాట్లాడలేదని సంఘ్ పరివార్ పదేపదే వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
లాలూ, నితీశ్ ఎదురుదాడి
దీన్ని నాడు బీహార్ సిఎం నితీశ్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ ల సారథ్యంలోని విపక్షం ప్రధాన ఎన్నికల ప్రచారాస్త్రంగా తీర్చిదిద్దింది. రిజర్వేషన్లకు చరమగీతం పాడేందుకు ఆర్ఎస్ఎస్ కుట్ర చేసిందని ప్రజల్లోకి విస్త్రుతంగా తీసుకెళ్లగలిగింది. లాలూ మరో అడుగు ముందుకేసి ఆ పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారన్నారు. మోహన్ భగవత్ ప్రకటన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి భవితవ్యాన్ని ముందే ఖరారుచేసిందని లాలూ వ్యాఖ్యానించారు.
మోహన్ భగవత్ ఇలా..
భారతదేశంలో రిజర్వేషన్ల అమలు పట్ల రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్ఎస్ఎస్) తొలి నుంచి వ్యతిరేకమే. రాజ్యాంగ నిర్మాతల నిర్ణయం పట్ల సంఘ్కు ద్వేషపూరిత అనుబంధం ఉంది. అధినేతలు, సిద్దాంత కర్తలు వ్యతిరేక వ్యాఖ్యలు చేసినప్పుడల్లా దాన్ని సరిదిద్దుకునేందుకు సంఘ్ పదేపదే వివరణలు ఇచ్చింది. వివిధ సందర్భంగా రిజర్వేషన్ల అమలుపై సంఘ్ నేతలు ఏమన్నారో ఒక్కసారి పరిశీలిద్దాం..
- ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ 2014 సెప్టెంబర్ 8న మాట్లాడుతూ సమాజంలో అసమానతలు తొలగిపోయే వరకు రిజర్వేషన్లు అవసరమేనని, తమ మద్దతు ఉంటుందన్నారు. ఇదే మోహన్ భగవత్ 2015 సెప్టెంబర్ 21న జరిగిన మరో కార్యక్రమంలో ప్రజాస్వామ్యంలో కొన్ని ఆకాంక్షలతో కొన్నివ్యక్తిగత ప్రయోజనాల గ్రూపులు ఆవిర్భవిస్తాయని, ఆయా గ్రూపుల ఆకాంక్షలే మిగతా సామాజిక వర్గాల ఆకాంక్షలను పరిష్కరిస్తాయని మనం నమ్మొద్దన్నారు. అదే ఏడాది డిసెంబర్ 17న మాట్లాడుతూ రిజర్వేషన్ల వ్యవస్థను రద్దు చేయాలని ఏనాడూ ఆర్ఎస్ఎస్ చెప్పలేదు. భారత సమాజంలో సామాజిక వివక్ష తొలగిపోయే వరకు దేశంలో రిజర్వేషన్లు అమలుచేయాల్సిందేనన్నారు.
రిజర్వేషన్లు కొనసాగాల్సిందే..
ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత సురేశ్ భయ్యాజీ జోషి 2015 నవంబర్ మూడో తేదీన మాట్లాడుతూ సమాజానికి అవసరమైనంత కాలం రిజర్వేషన్లు అమలుచేయాల్సిందేనన్నారు. ఇది తమ సంస్థ వైఖరి అని స్పష్టంచేశారు. భగవత్ చేసిన వ్యాఖ్యలు మీడియాలో సరిగ్గా ప్రతిబింబించలేదన్నారు. రిజర్వేషన్ల విధానాన్ని సమీక్షించాల్సి ఉన్నదన్నారు. ఇది సమాజానికి తప్పనిసరన్నారు.
వివక్ష తొలగి పోయే వరకూ..
2016 మార్చిలో ఆర్ఎస్ఎస్ సంయుక్త ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసాబోలే స్పందిస్తూ సమాజం నుంచి వివక్ష తొలగిపోయే వరకు తాము రిజర్వేషన్లకు మద్దతునిస్తామన్నారు.
కుల ప్రాతిపదికన రిజర్వేషన్లొద్దు
2015 ఆగస్టు 30న ఆర్ఎస్ఎస్ సిద్దాంత వేత్త ఎంజి వైద్య స్పందిస్తూ ప్రస్తుతం కులాల ప్రాతిపదికన రిజర్వేషన్ల వ్యవస్థే అవసరం లేదన్నారు. ఏ కులం కూడా వెనుకబడి లేదన్నారు. మరో పదేళ్ల వరకు మాత్రం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అమలుచేసి.. తర్వాత పూర్తిగా కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లు పూర్తిగా రద్దు చేయాల్సిందేనన్నారు.