అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యలతో లోక్సభలో గందరగోళం, కాంగ్రెస్ వాకౌట్
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ సభ్యులు చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ సభ్యులు లోక్సభలో ఆందోళన చేపట్టారు. దీంతో లోక్సభ కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. పన్ను, ఇతర చట్టాల పరిచయం (కొన్ని నిబంధనల సడలింపు, సవరణ) బిల్లు, 2020 చర్చ సందర్భంగా ఈ గందరగోళం నెలకొంది.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగం అనంతరం ఆర్థిక సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ పీఎం కేర్స్ ఫండ్ గురించి మాట్లాడారు. ఆయన మాట్లాడుతున్న సమయంలోనే కాంగ్రెస్ సభ్యులు నిధుల వివరాలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. దీంతో అనురాగ్ ఠాకూర్ వారికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు.

కాంగ్రెస్ హయాంలో పీఎం రిలీఫ్ ఫండ్ దుర్వినియోగం అయ్యిందంటూ అనురాగ్ ఆరోపణలు చేశారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. ఆ తర్వాత లోక్సభ నుంచి వాకౌట్ చేశారు. ఇక బీజేపీ సభ్యుడు లాకెట్ ఛటర్జీ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు కళ్యాణ్ బెనర్జీ నిరసన తెలిపారు. దీంతో సభ వాయిదా పడుతూ కొనసాగింది.
ఈ క్రమంలో స్పీకర్ ఓం బిర్లా సభ్యులను హెచ్చరించారు. కరోనా నిబంధనలకు వ్యతిరేకంగా నిల్చుని మాట్లాడే సభ్యులను సస్పెండ్ చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. సభా మర్యాదలను పాటించాలని సభ్యులకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సూచించారు.
నిరసనల అనంతరం అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ఎవరినీ బాధించాలనే ఉద్దేశంతో తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. ఎవరైనా బాధపడితే.. తాను క్షమాపణలు చెబుతానని వ్యాఖ్యానించారు. కాగా, అంతకుముందు, చర్చ సందర్భంగా పీఎం నేషనల్ రిలీఫ్ ఫండ్ ద్వారా గాంధీ కుటుంబం లబ్ధి పొందిందని అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే సభలో కాంగ్రెస్ సభ్యులు నిరసన చేపట్టారు.












Click it and Unblock the Notifications