2019 ఎన్నికలకు ఏకం కానున్న ప్రాంతీయపార్టీలు..?
2019 సాధారణ ఎన్నికలకు కొన్ని నెలలే సమయం ఉన్నందున బలమైన బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రాంతీయ పార్టీలు ఏకమవుతాయా...? ఇప్పుడు ప్రస్తుతం ఇదే ప్రశ్న రాజకీయ వర్గాల్లో వైరల్ అవుతోంది. ఒకవేళ అదే జరిగితే బీజేపీకి కష్టమేనన్న సంకేతాలు వస్తున్నాయి. అయితే బీజేపీని కేంద్రంలో దెబ్బ కొట్టాలంటే రాష్ట్రాల్లో ఒకరంటే ఒకరు పడని ప్రాంతీయ పార్టీలు ఏకం కాగలవా అనే ప్రశ్న చాలామందిని తొలుస్తోంది.
గతనెల కర్నాటక ముఖ్యమంత్రిగా కుమార స్వామి ప్రమాణ స్వీకారం సందర్భంగా బెంగళూరులో ఒకటే వేదికపై కనిపించారు జాతీయ పార్టీ నేతలు ప్రాంతీయ పార్టీ అధినేతలు. దీంతో బీజేపీకి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయ్యిందని కూడా చాలామంది అనుకున్నారు. కానీ వాస్తవానికి వచ్చే ఎన్నికలకు కాంగ్రెస్, కమ్యూనిస్టులతో కలిపి ప్రాంతీయ పార్టీలన్నీ ఓ మహాకూటమిలా ఏర్పడుతాయా...? అంటే ఓక యాంగిల్లో ఇది సాధ్యమే అన్నట్లుగా కనిపించినప్పటికీ మరో కోణంలో మాత్రం ఇది ఒక్కింత కష్టంగానే అనిపిస్తోంది. అయితే దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు తమ భేషజాలను పక్కనబెట్టి మహాకూటమిగా ఏర్పడితే ఇక బీజేపీ అడ్రస్ గల్లంతే అని రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఉత్తర్ ప్రదేశ్లో బద్ద శత్రువులైన సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీలు చేతులు కలపడంతో అక్కడ గోరఖ్పూర్, ఫూల్పూర్ నియోజకవర్గాల్లో బీజేపీకి ఘోర పరాజయం ఎదురైంది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికల్లో కూడా బీజేపీకి ఓటమి తప్పలేదు. దీంతో కొంత డిఫెన్స్లో పడిపోయింది కమలం పార్టీ. ఇదే ఫార్ములాను సాధారణ ఎన్నికల్లో ఉపయోగించాలంటే అది చాలా కష్టమే అంటున్నారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్.
మహాకూటమిగా ఏర్పడాలంటే ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ సమీకరణాలు, ప్రాంతీయ భేషజాలతో సాధ్యం కాదని చెబుతున్నారు శరద్ పవార్. అయితే ఎన్నికల తర్వాత బీజేపీయేతర శక్తులు ఒక్కటయ్యే అవకాశం లేకపోలేదని శరద్ పవర్ జోస్యం చెప్పారు. ప్రస్తుత పరిణామాలు చూసి కాంగ్రెస్ అప్పుడే ప్రాంతీయ పార్టీల అధినేతలను దువ్వడం మొదలు పెట్టింది. ప్రాంతీయ పార్టీల అధినేతలతో కాంగ్రెస్ చర్చలు జరుపుతోందని అయితే అన్ని రాష్ట్రాల్లో అది సాధ్యం కాదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా వివరించారు.
మరోవైపు ప్రాంతీయ పార్టీ అధినేతలను మచ్చిక చేసుకునేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పావులు కదిపారు. ఇందులో భాగంగానే ఆయన ప్రాంతీయ పార్టీల అధినేతలను ఇఫ్తార్ విందును ఇచ్చారు. అంతా బాగుందనుకుంటున్న సమయంలో కాంగ్రెస్ అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్న దీక్షపై అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శల పాలైంది. బీజేపీ కూడా కేజ్రీ దీక్షను తప్పుబట్టగా కాంగ్రెస్ కూడా బీజేపీని ఫాలో అవడంపై పలువురు ప్రాంతీయ పార్టీ అగ్రనేతలు జీర్ణించుకోలేకున్నారు. ఇప్పటికే దీక్ష చేస్తున్న కేజ్రీవాల్ను నలుగురు ముఖ్యమంత్రులు పరామర్శించారు.
ఇక 2019 ఎన్నికల్లో బలమైన బీజేపీ పార్టీని దెబ్బకొట్టాలంటే ప్రాంతీయ పార్టీలు తమ బేషజాలను పక్కన బెట్టి ఒకే తాటిపైకొస్తేనే విజయం సిద్ధిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.