భారత పర్యటనకు పుతిన్: ఆర్మీ కోసం ఏకే 203 రైఫిల్స్: కొనుగోళ్ల కోసం రష్యాతో డీల్
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. భారత పర్యటనకు రానున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. రెండు రోజుల పాటు ఆయన భారత్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమౌతారు. పలు అంతర్జాతీయ అంశాలు వారిమధ్య చర్చకు రానున్నాయి. రష్యా తయారు చేస్తోన్న ఏకే 203 రైపిళ్లను కొనుగోలు చేయడానికి ఉద్దేశించిన ఒప్పందంపైనా రెండు దేశాలకు చెందిన రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు సంతకాలు చేస్తారని తెలుస్తోంది.
దీనికి సంబంధించిన ఒప్పందాలు, ఇతర అంశాలపై చర్చించడానికి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) ఇవ్వాళ సమావేశం కానుంది. ఈ కొనుగోళ్లు సంబంధించిన ప్రతిపాదనలకు తుది రూపాన్ని ఇవ్వనుంది. దేశ రాజధానిలోని రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఈ భేటీ ఏర్పాటు కానుంది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, రక్షణ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సహా పలువురు ఉన్నతాధికారులు ఇందులో పాల్గొంటారు.
వ్లాదిమిర్ పుతిన్.. వచ్చేనెల 5వ తేదీన భారత పర్యటనకు రానున్నారు. మాస్కో నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరే ఆయన ఢిల్లీకి చేరుకుంటారు. రెండు రోజుల పాటు ఆయన పర్యటన సాగుతుంది. ప్రధాని మోడీతో అత్యున్నత సమావేశంలో పాల్గొంటారు. ఆసియా పసిఫిక్ రీజియన్, పసిఫిక్-హిందూ మహాసముద్రం మధ్యన ఉండే దక్షిణ సముద్రంపై పట్టు సాధించడానికి చైనా సాగిస్తోన్న ప్రయత్నాలు, విసాల సరళీకరణ.. ద్వైపాక్షిక ఒప్పందాలు వంటి జాతీయ, అంతర్జాతీయ అంశాలు వారి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది.
ఉత్తర ప్రదేశ్లోని అమేథీ సమీపంలో ఏకే రకానికి చెందిన శక్తిమంతమైన రైఫిళ్ల తయారీ యూనిట్ను చాలా సంవత్సరాల కిందటే నెలకొల్పింది రష్యా. భారత్-రష్యా మధ్య ద్వైపాక్షిక ఒప్పందాల్లో భాగంగా రష్యా దీన్ని నెలకొల్పింది. ఈ యూనిట్లోనే రష్యా అవ్టోమాట్ కలష్నికోవ్ రైపిళ్లను తయారు చేసింది. ఏకే 47 సహా ఆ సిరీస్కు చెందిన అన్ని రకాల రైఫిళ్లు అమేథీ యూనిట్లోనే తయారవుతున్నాయి.
Recommended Video
ఈ సిరీస్లో రష్యా కొత్తగా అభివృద్ధి చేసిన ఏకే 203 అసాల్ట్ రకానికి చెందిన రైఫిళ్లను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. కనీసం ఏడున్నర లక్షల ఏకే 203 అసాల్ట్ రైఫిళ్లను కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీనికి అవసరమైన ఒప్పందాన్ని- పుతిన్ పర్యటన సందర్భంగా కుదుర్చుకోనుంది. ఈ ఒప్పందాల విలువ 5,000 కోట్ల రూపాయలు. 10 సంవత్సరాల కాల వ్యవధిలో ఈ ఏడున్నర లక్షల ఏకే 203 రైఫిళ్లను రష్యా.. భారత ఆర్మీకి అప్పగించాల్సి ఉంటుంది.