శబరిమల ఆలయ ప్రవేశంపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా
న్యూఢిల్లీ: శబరిమల అయ్యప్ప ఆలయం తోపాటు ఇతర ప్రార్థనా మందిరాల్లోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా పడింది. విచారణ అంశాలను తామే ఖరారు చేస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే తెలిపారు.
నా భార్యకు అదే చెప్పా: శబరిమల ఆలయ ప్రవేశంపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
Recommended Video
విచారణ చేపట్టాల్సిన అంశాలు, ప్రశ్నలు తామే రూపొందిస్తామని చెప్పారు. తదుపరి విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేశారు. ఈ అంశంపై వాదనలు వినిపించేందుకు న్యాయవాదులకు సమయం చెబుతామని ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం తెలిపారు.
శబరిమలపై దాఖలైన రివ్యూ పిటిషన్లతోపాటు ఇతర ప్రార్థనా మందిరాల్లోకి మహిళల ప్రవేశంపైనా రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయం తీసుకోలేదని సీజేఐ వెల్లడించారు. మత విశ్వాసాలు, వాటిలో జోక్యం చేసుకునే విషయంలో న్యాయ పరిధిపై మాత్రమే విచారణ ఖరారు చేయనున్నారు.
కాగా, గత ఏడాది సెప్టెంబర్లో అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదుపై తీర్పు ఇచ్చిన తరువాత.. శబరిమలపైనా సుప్రీంకోర్టు తుది నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉండగా.. వాయిదా పడింది. శబరిమల ఆలయంలో మహిళలకు ప్రవేశం కల్పించడంపై దాఖలైన మొత్తం 69 పిటీషన్లను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేశారు అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్. ఆ తరువాత.. ఈ పిటీషన్పై బెంచ్ మారిపోయింది.
ఏడుమంది సభ్యులు గల విస్తృత ధర్మాసనానికి శబరిమల రివ్యూ పిటీషన్లను బదిలీ చేసినప్పటికీ.. ఆ తరువాత ఈ సంఖ్య తొమ్మిదికి పెరిగింది. ప్రస్తుతం తొమ్మిది మంది సభ్యులు గల విస్తృత ధర్మాసనం ఈ రివ్యూ పిటీషన్పై విచారణ చేపట్టనుంది. శబరిమల ఆలయంలోకి ప్రవేశాన్ని కల్పించాలంటూ ఇదివరకు మహిళా సంఘాలు దాఖలు చేసిన పిటీషన్లను కొట్టేయడం.. తుది తీర్పుపై ప్రభావం చూపే అవకాశాలు లేవని అంటున్నారు.