సచిన్ వర్సెస్ గెహ్లాట్: అప్పటివరకు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయొద్దు: స్పీకర్కు హైకోర్టు సూచన
జైపూర్: రాజస్థాన్ హైకోర్టులో సచిన్ పైలట్ కేసులో విచారణ ముగిసింది. శుక్రవారం రోజున కేసుకు సంబంధించిన తీర్పును వెలువరిస్తామని ధర్మాసనం పేర్కొంది. అప్పటి వరకు సచిన్తో పాటు ఆయన వర్గం ఎమ్మెల్యేలపై ఎలాంటి అనర్హత వేటు వేయడానికి వీలు లేదని స్పీకర్ను కోరింది కోర్టు. అంతకుముందు సచిన్ పైలట్ తరపున కోర్టులో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ ఫిర్యాదు చేసిన రోజునే స్పీకర్ అనర్హత నోటీసులు ఇచ్చారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.
ఇక అనర్హత నోటీసులు ఇచ్చి వివరణకు చాలా తక్కువ సమయం ఇచ్చారని ఇది నిబంధనలను ఉల్లంఘించేలా ఉందని ముకుల్ రోహత్గీ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఇదిలా ఉంటే అనర్హత వేటు ఎందుకు వేయాల్సి వస్తుందో స్పష్టమైన వివరణ నోటీసులో పేర్కొనలేదని కోర్టుకు తెలిపారు. అది ఒక ఫిర్యాదులానే ఉంది తప్ప సరైన పద్ధతిలో లేదని ధర్మాసనంకు తెలిపారు ముకుల్ రోహత్గీ. అంతేకాదు నోటీసులు ఎందుకు సర్వ్ చేస్తున్నారో అని చెప్పేందుకు సరైన కారణాలు లేవని అదే సమయంలో వివరణ రాతపూర్వకంగా ఇవ్వాలని చెప్పినట్లు వెల్లడించారు.
ఇదిలా ఉంటే సోమవారం పార్టీ సమావేశానికి విప్ జారీ చేయరాదని సూచించింది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అంతకుముందు నిర్వహించిన రెండు పార్టీ సమావేశాలకు సచిన్ పైలట్తో సహా అతని వర్గపు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని పేర్కొంటూ వారికి అనర్హత నోటీసులను పంపడం జరిగింది. అయితే అసెంబ్లీ సమావేశాలు లేని సమయంలో స్పీకర్ నోటీసులు ఎలా జారీ చేస్తారని సచిన్ వర్గం వాదించింది. అంతేకాదు పార్టీ పట్ల అసంతృప్తి వ్యక్తం చేసినంత మాత్రానా ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయడం సరికాదని సచిన్ పైలట్ పేర్కొన్నారు. ఇక ఇరువర్గాల వారి వాదనలు విన్న న్యాయస్థానం కేసులో తీర్పును శుక్రవారంకు రిజర్వ్ చేస్తూ అదే సమయంలో ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు నిర్ణయం తీసుకోరాదంటూ చెప్పింది.