రద్దు: చెత్తకుప్పల్లో పడేసి రూ.500, 1000నోట్లను కాల్చేశారు!
బరైలీ: రూ. 500, 1000 నోట్ల రద్దుతో కొందరు అవగాహన లేక ఆందోళన చెందుతుంటే.. మరికొందరు ఎక్కడ తమ బండారం బయటపడుతుందోనని భయపడుతున్నారు. కొందరు ఎవరికీ తెలియకుండా ఆ నోట్లను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
తాజాగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. ఉత్తర్ప్రదేశ్లోని బరేలీలో ఓ కంపెనీ కార్మికులు రూ.500, రూ.1000 నోట్లను బస్తాల్లో తెచ్చి గుట్టలుగా కుమ్మరించి కాల్చి బూడిదచేశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
నోట్లను ముందు చించేసి తర్వాత దహనం చేసినట్లు తెలిపారు. ఈ ఘటనలో కంపెనీ యాజమాన్యాన్ని విచారించనున్నట్లు పోలీసులు వెల్లడించారు. నల్లధనం నియంత్రణకు మంగళవారం రాత్రి నుంచి రూ.500, 1000 నోట్లు రద్దుచేస్తున్నట్లు భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ ప్రకటనతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తాము దాచుకున్న నల్లధనాన్ని ఏం చేయాలో తెలీక వారంతా ఆలోచనలో పడ్డారు. కొందరు దీన్ని తప్పించుకోలేక ఇలాంటి ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం.