సాధువు, ఆయన శిష్యుడిని కొట్టి చంపిన దుండగులు: రెండు నెలల్లో రెండోసారి: రక్తపు మడుగులో
ముంబై: మహారాష్ట్ర మూకదాడులు పరంపర కొనసాగుతూనే వస్తోంది. సాధువులను కొట్టిచంపిన దారుణ ఘటన మరొకటి చోటు చేసుకుంది. సాధువులపై దాడి చేసి, కొట్టి చంపడం మహారాష్ట్రలో ఈ రెండు నెలల కాలంలో ఇది రెండో ఉదంతం. కొద్దిరోజుల కిందట పాల్ఘర్ జిల్లాలో ఇద్దరు సాధువులను కొట్టి చంపిన ఘటనకు సంబంధించిన ప్రకంపనలు ఇంకా తగ్గలేదు. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న ఉద్ధవ్ థాకరే ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తమ దాడిని తీవ్రతరం చేస్తూనే వస్తున్నాయి. అదే సమయంలో అలాంటి దారుణ ఘటన మరొకటి చోటు చేసుకుంది.
సాధు శివాచార్య, ఆయన శిష్యుడి దారుణ హత్య..
నాందెడ్లోని ఆశ్రమంలో నివసిస్తోన్న సాధు శివాచార్య నాగఠన్కర్, ఆయన శిష్యుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. సాధు శివాచార్య మృతదేహం ఆశ్రమంలోనే లభించింది. ఆయన శిష్యుడి మృతదేహం ఆశ్రమానికి కొద్దిదూరంలో కనిపించింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టమ్ కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ఆరంభించారు.
రెండు రాష్ట్రాల్లో భక్తులు..
శివాచార్య చాలాకాలం కిందటే నాందెడ్ జిల్లాలోని ఉమ్రి తాలూకాలో ఆశ్రమాన్ని నెలకొల్పారు. తరచూ ఆధ్యాత్మక ప్రసంగాలను ఆయన ఇస్తుంటారు. ఆశ్రమం పేరుతో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. జిల్లాలో ఆయనకు పెద్ద ఎత్తున భక్తులు ఉన్నారు. శివరాత్రి వంటి పండుగల సమయంలో శివాచార్య ఆశ్రమం వందలాదిమంది భక్తులతో క్రిక్కిరిసిపోతుంటుంది. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భారీ సంఖ్యలో భక్తులు ఈ ఆశ్రమానికి వస్తుంటారు.
తెల్లవారు జామున హత్య..
గుర్తు తెలియని వ్యక్తులు ఉమ్రి ఆశ్రమంపై దాడి చేసి, ఆయనను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత 3 నుంచి 4 గంటల మధ్యలో హత్య జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఆదివారం తెల్లవారు జామున ఆశ్రమం సిబ్బంది శివాచార్య మృతదేహాన్ని చూశారు. ఆశ్రమంలో రక్తపు మడుగులో శివాచార్య మృతదేహం కనిపించింది. ఆశ్రమానికి కొద్దిదూరంలో ఆయన శిష్యుడి మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులకు సమాచారాన్ని ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు.
కాల్ లిస్ట్.. సీసీటీవీ ఫుటేజ్
ఈ ఘటన చోటు చేసుకోవడానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. శివాచార్య కాల్ లిస్ట్ గురించి ఆరా తీస్తున్నారు. ఇదివరకు ఆయనకు బెదిరింపు ఫోన్లు వచ్చాయేమోనే విషయంపై కూపీ లాగుతున్నారు. ఆశ్రమంలో అమర్చిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నాందెడ్ జిల్లా ఎస్పీ స్వయంగా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు దర్యాప్తును ఆయన పర్యవేక్షిస్తున్నారు. నిందితుల కోసం నాందెడ్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున గాలింపు చర్యలను చేపట్టారు. కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
Recommended Video
పాల్ఘర్ తరహాలో
కిందటినెలలో మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఇద్దరు సాధవులను కొట్టి చంపిన ఉదంతం తెలిసిందే. చిన్నపిల్లలను ఎత్తుకెళ్లడానికి వచ్చి ఉండొచ్చనే అనుమానాంతో ఇద్దరు సాధువులను గ్రామస్తులు కొట్టి చంపారు. మూకదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సుమారు 200 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా నాందెడ్లో సాధు శివాచార్య ఉదంతం కూడా అలాంటిదేనని అంటున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను ఉద్దేశపూరకంగా కొట్టి చంపారా? లేక దొంగతానికి వచ్చి, ఈ హత్యకు పాల్పడి ఉంటారా? అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.