సాహిత్య అకాడెమీ గ్రహీత అనుమానాస్పద మృతి.. ఏం జరిగింది..?
బెంగళూరు: బెంగళూరుకు చెందిన ప్రొఫెసర్ కేంద్ర సాహిత్య అకాడెమీ గ్రహీత నంజున్దన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కెంగేరీలోని అతని నివాసంలో శనివారం మృతి చెందారు. బెంగళూరు యూనివర్శిటీలోని స్టాటిస్టిక్స్ విభాగంలో ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు నంజున్దన్. పోలీసులు కథనం ప్రకారం నంజుదన్ కెంగేరీలోని తన అపార్ట్మెంటులో ఒంటరిగా ఉంటున్నట్లు చెప్పారు.
అతని భార్య పిల్లలు చెన్నైలో ఉంటున్నట్లు సమాచారం. గత బుధవారం నుంచి తాను విధులకు హాజరుకావడం లేదని బెంగళూరు యూనివర్శిటీలోని స్టాటిస్టిక్స్ విభాగం వారు చెప్పారు. ఏమైందో తెలుసుకునేందుకు ఫోన్ చేయగా నంజున్దన్ ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తున్నట్లు సిబ్బంది తెలిపింది.
కుటుంబ సభ్యులు కూడా తనతో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో అక్కడే ఉన్న నంజున్దన్ స్నేహితులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. వెంటనే కెంగేరీలోని నంజున్దన్ నివాసంకు చేరుకున్న స్నేహితులు ముందుగా తలుపు కొట్టారు. ఎంతకీ తలుపు తీయకపోవడం లోపల నుంచి ఎలాంటి శబ్దం రాకపోవడంతో తలపులను పగలగొట్టి లోపలికి వెళ్లారు.
లోపలికి వెళ్లి చూడగా నంజున్దన్ పరుపుపై విగతజీవుడై కనిపించారు. అప్పటికే మృతదేహం నుంచి దుర్వాసన వస్తోంది. ఇదిలా ఉంటే నాలుగు రోజుల క్రితమే నంజున్దన్ మృతి చెంది ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేకాదు నంజున్దన్కు గుండె సంబంధిత జబ్బు కూడా ఉందని కుటుంబ సభ్యుల ద్వారా పోలీసులు తెలుసుకున్నారు.
నంజున్దన్ మృతదేహాన్ని పోలీసులు పోస్టు మార్టంకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అనుమానాస్పద మృతి కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టు మార్టం రిపోర్టు రాగానే పూర్తి వివరాలు చెబుతామని పోలీసులు వెల్లడించారు. పలు ప్రముఖ జర్నల్స్లో ప్రొఫెసర్ నంజున్దన్ పేపర్స్ పబ్లిష్ అయ్యాయి. 2012లో అక్కా పేరుతో పలువురు కన్నడ మహిళా రచయితలు రాసిన పొట్టికథలను తమిళంలోకి తర్జుమా చేసినందుకుగాను నంజున్దన్ను కేంద్రం సాహిత్య అకాడెమీ అవార్డుతో సత్కరించింది.