షిర్డీ సాయి సంస్థాన్ ట్రస్ట్ను టిటిడికి అప్పగించాలి: రాజ్ థాకరే
ముంబై: షిర్డీలోని ప్రఖ్యాత సాయిబాబా ఆలయ కార్యక్రమాలు సజావుగా సాగేందుకు వీలుగా ఆ ఆలయ పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్న శ్రీసాయిబాబా సంస్థాన్ ట్రస్టు (ఎస్ఎస్ఎస్టి)ను తిరుమల తిరుపతి దేవస్థానాల (టిటిడి)కు అప్పగించాలని మహారాష్ట్ర నవ నిర్మాణసేన(ఎంఎన్ఎస్) అధినేత రాజ్థాకరే డిమాండ్ చేశారు.
ప్రస్తుతం ఆలయం బాధ్యతలు చూస్తున్న శ్రీసాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ అవినీతి, అవకతవకల్లో కూరుకుపోయిందని ఆరోపించారు. షిర్డీ ఆలయ సేవలను, భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని.. ఆలయ నిర్వహణను టిటిడికి అప్పగించాలని కోరారు.
‘షిర్డీ ఆలయం పరిధిలో జరుగుతున్న వ్యవహారాలను గురించి కొన్నేళ్లుగా వింటున్నాం. ఆలయ ట్రస్టు అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నది. ఈ పరిస్థితుల్లో నిర్వహణ బాధ్యతలను మార్చాల్సిన అవసరం ఉంది. ఈ పని చేయడానికి టిటిడిని మించిన సంస్థ లేదు' అని తెలిపారు.
ఆయన ఆదివారం షిర్డీ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘నేను తిరుమలకు అనేకసార్లు వెళ్లాను. వంక పెట్టలేని విధంగా టిటిడి.. శ్రీ వేంకటేశ్వరాలయాన్ని అత్యంత మెరుగ్గా నిర్వహిస్తున్నది' అని రాజ్ థాకరే చెప్పారు.