సాక్షి మలిక్: రైల్వే ఉద్యోగంలో తిరిగి చేరా, లైంగిక వేధింపులపై పోరాటం కొనసాగిస్తా

సాక్షి మలిక్

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ ఉద్యమిస్తున్న తాను దానిని విరమించుకున్నట్లు వస్తున్న వార్తలను రెజ్లర్ సాక్షి మలిక్ ఖండించారు.

రైల్వేశాఖలో తన విధులు నిర్వహిస్తున్నానని, అలాగే న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తానని సాక్షి మలిక్ ట్వీట్ చేశారు.

తాను ఆందోళన నుంచి తప్పుకుంటున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలను ఆమె తప్పుబట్టారు. తానేకాదు, ఆందోళనకు దిగిన ఏ ఒక్క రెజ్లర్ కూడా నిరసన కార్యక్రమాల నుంచి వెనక్కి తగ్గరని ఆమె తన ట్వీట్లో స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఉత్తర రైల్వే విభాగంలో ఓఎస్డీగా ఉద్యోగం చేస్తున్న సాక్షి మలిక్, సోమవారం నుంచి విధులకు హాజరవుతున్నారు.

బజరంగ్ పునియా కూడా రైల్వేలో తన విధులకు హాజరవుతున్నారు.

శనివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో రెజ్లర్ల భేటీ జరిగింది. బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ అరెస్టు డిమాండ్‌‌ పై రెజ్లర్లు వెనక్కు తగ్గకపోవడంతో ఈ సమావేశం శనివారం పొద్దుపోయే వరకు సాగింది.

https://twitter.com/SakshiMalik/status/1665645066105544705

రెజ్లర్ల ఆందోళన ఏంటి?

దిల్లీలోని జంతర్‌మంతర్ వేదికగా జనవరి 18న ప్రముఖ రెజ్లర్లు నిరసనకు కూర్చున్నారు. డబ్లూఎఫ్‌ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్‌పై వీరు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు.

నిరసనకు దిగిన ప్రముఖ రెజ్లర్లలో రెండు ప్రపంచ చాంపియన్‌షిప్ పతకాల విజేత వినేశ్ ఫోగాట్, రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత బజరంగ్ పునియా తదితరులు ఉన్నారు.

అనేక ఏళ్ల నుంచి బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని రెజ్లర్లు ఆరోపించారు.

బ్రిజ్ భూషణ్‌కు సన్నిహితులైన కొందరు అధికారులు తనను చంపేస్తానని కూడా బెదిరించినట్లు వినేశ్ ఫోగాట్ చెప్పారు. తాము నిత్యం ''భయం, ఆందోళన’’తోకూడిన వాతావరణంలో గడుపుతున్నామన్నారు. కొందరు జాతీయ కోచ్‌లు కూడా బ్రిజ్ భూషణ్‌వైపే ఉన్నట్లు తెలిపారు.

తన పదవికి బ్రిజ్ భూషణ్ రాజీనామా చేయాలని, డబ్ల్యూఎఫ్ఐను రద్దు చేయాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు.

ఈ విషయంలో స్పందించాలని డబ్ల్యూఎఫ్ఐకి క్రీడల శాఖ నోటీసులు పంపించింది. ఆరోపణలు రుజువైతే జాతీయ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ కోడ్ కింద చర్యలు తీసుకుంటామని తెలిపింది.

నిరసన చేపడుతున్నవారిని మాజీ రెజ్లర్, బీజేపీ నాయకురాలు బబితా ఫోగాట్ కలిశారు. ప్రభుత్వంతో తాను మాట్లాడతానని ఆమె చెప్పారు. అయితే, అదే రోజు టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత రవీ దహియా, వరల్డ్ చాంపియన్‌షిప్ పతక విజేత దీపక్ పునియా కూడా నిరసన చేపడుతున్న వారితో కలిశారు.

అదే రోజు రెజ్లర్లు కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకుర్‌ను ఆయన నివాసంలో కలిశారు. ఈ సమావేశం దాదాపు ఐదు గంటలు సాగింది. కానీ, ఎలాంటి పరిష్కారమూ లభించలేదు.

సాక్షి మలిక్

కమిటీ ఏర్పాటు

ఈ ఆరోపణలపై విచారణకు ఒలిపింక్ పతక విజేత ఎంసీ మేరీ కోమ్‌ నేతృత్వంలో ఒక కమిటీని ఐవోఏ ఏర్పాటు చేసింది.

రెజ్లర్లు మళ్లీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకుర్‌ను కలిశారు. ఆరోపణలపై విచారణకు ఒక ''ఓవర్‌సైట్ కమిటీ’’ ఏర్పాటుచేస్తామని, ఆ విచారణ పూర్తయ్యేవరకు బాధ్యతల నుంచి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తప్పుకుంటారని హామీ ఇవ్వడంతో ఆ రోజు రాత్రి నిరసనలను విరిమించుకుంటున్నట్లు రెజ్లర్లు ప్రకటించారు.

అయితే, అదే రోజు కేంద్ర క్రీడాశాఖకు డబ్ల్యూఎఫ్ఐ తమ స్పందనను పంపింది. బ్రిజ్ భూషణ్ లేదా కోచ్‌లు ఎవరూ లైంగిక వేధింపులకు పాల్పడలేదని చెబుతూ, రెజ్లర్ల ఆరోపణలను డబ్ల్యూఎఫ్ఐ ఖండించింది.

ఆ తర్వాత ర్యాంకింగ్ టోర్నమెంటుతోపాటు డబ్ల్యూఎఫ్ఐ కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని క్రీడా శాఖ ఆదేశాలు జారీచేసింది. డబ్ల్యూఎఫ్ఐ అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్‌ను కూడా విధుల నుంచి తప్పించింది.

ఐదుగురు సభ్యుల ఓవర్‌సైట్ కమిటీ బాధ్యతలను కూడా మేరీ కోమ్‌కు అప్పగించారు. ఒలింపిక్ పతక విజేతలు యోగేశ్వర్ దత్, తృప్తి ముర్‌గుండే, రాజగోపాలం, రాధికా శ్రీమాన్‌ ఈ కమిటీలో ఇతర సభ్యులుగా ఉన్నారు.

నాలుగు వారాల్లోగా దర్యాప్తు పూర్తిచేయాలని కమిటీకి సూచించారు. అదే సమయంలో డబ్ల్యూఎఫ్ఐ బాధ్యతలను కూడా ఈ కమిటీకే అప్పగించారు.

https://twitter.com/ANI/status/1665650792060325888

మళ్లీ నిరసన ఎప్పుడు మొదలైంది?

ఏప్రిల్ 23న దిల్లీలోని సీపీ పోలీస్ స్టేషన్‌లో బ్రిజ్ భూషణ్‌పై ఒక మైనర్ సహా ఏడుగురు రెజర్లు లైంగిక వేధింపుల ఆరోపణలతో ఫిర్యాదు చేశారని, కానీ, పోలీసులు ప్రాథమిక విచారణ నివేదిక (ఎఫ్ఐఆర్)ను నమోదు చేయడంలేదని చెబుతూ దిల్లీలో మళ్లీ రెజ్లర్లు నిరసనకు కూర్చున్నారు.

తమ ఫిర్యాదు ఆధారంగా బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని, ఓవర్‌సైట్ కమిటీ నివేదికనూ బయటపెట్టాలని వారు డిమాండ్ చేశారు.

డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల ప్రక్రియలను క్రీడాశాఖ రద్దు చేసింది. ఆ తర్వాత ఐవోఏ అధ్యక్షురాలు పీటీ ఉషకు ఒక లేఖ రాసింది. డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల కోసం ఒక తాత్కాలిక కమిటీని ఏర్పాటుచేయాలని, అప్పటివరకు డబ్ల్యూఎఫ్ఐ బాధ్యతలను తామే చూసుకోవాలని సూచించింది.

బ్రిజ్ భూషణ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ రెజ్లర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బ్రిజ్ భూషణ్‌పై వచ్చిన ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయని, దీనిపై స్పందించాలని దిల్లీ పోలీసులకు కోర్టు సూచించింది.

''రెజ్లరు క్రమశిక్షణతో వ్యవహరించి ఉండాల్సింది. వీధుల్లో నిరసన చేపట్టకుండా ఐవోఏను వారు ఆశ్రయించి ఉండాల్సింది" అని మీడియాతో పీటీ ఉష వ్యాఖ్యానించారు.

బ్రిజ్ భూషణ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని సుప్రీంకోర్టులో దిల్లీ పోలీసులు చెప్పారు.

రెజర్లకు పొంచివున్న ముప్పులను అంచనా వేయాలని, వారికి తగిన భద్రత కల్పించాలని కోర్టు సూచించింది.

వినేశ్ ఫోగట్

కొత్త పార్లమెంటు ప్రారంభం రోజు ఏం జరిగింది?

మే 28న కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవంలో బ్రిజ్ భూషణ్ కూడా పాల్గొనడంతో కొత్త భవనం ముందు మహా పంచాయత్ నిర్వహించాలని రెజ్లర్లు భావించారు.

వారిని పార్లమెంటు భవనం వైపు వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. రెజ్లర్లను బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించారు. అప్పుడు తీసిన దృశ్యాలు వైరల్ అయ్యాయి.

జంతర్ మంతర్ వద్ద నిరసన చేపడుతున్న రెజ్లర్ల శిబిరాలను, ఇతర సామగ్రిని అక్కడి నుంచి తొలగించారు.

అయితే తమ నిరసన ముగిసిపోలేదని, మళ్లీ ఆందోళనకు దిగుతామని రెజ్లర్ సాక్షి మలిక్ మీడియాతో చెప్పారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+