ఆ రైల్వేస్టేషన్లలో ప్లాట్ఫామ్ టికెట్లు బంద్: ఈ రాత్రి నుంచే కంప్లీట్ లాక్డౌన్
ముంబై: మహారాష్ట్ర.. కరోనా వైరస్ పాజిటివ్ కేసులకు హాట్స్పాట్గా మారింది. ఈ మధ్యకాలంలో రోజూ అరలక్షకు పైగా కొత్త కేసులక్కడ పుట్టుకొస్తున్నాయి. వాటి తీవ్రత ఏ మాత్రం తగ్గట్లేదు. కరోనా వైరస్ కేసులు వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి వారాంతపు రోజుల్లో లాక్డౌన్ ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. ప్రధాన నగరాలు, జిల్లా కేంద్రాల్లో 144 సెక్షన్ విధించింది. రాత్రి వేళ కర్ఫ్యూను కొనసాగిస్తోంది. వారాంతపు రోజుల్లో లాక్డౌన్ శుక్రవారం నుంచి అమల్లోకి రానుంది. రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు మహారాష్ట్ర మొత్తం.. లాక్డౌన్లోకి వెళ్లిపోనుంది.
ఈ పరిణామాల మధ్య ముంబై ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ప్లాట్ ఫామ్ టికెట్ల జారీని నిలిపివేసింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వచ్చాయి. ముంబై, థానె పరిధిలోని ప్రధాన రైల్వేస్టేషన్లలో ఇకపై ప్లాట్ఫామ్ టికెట్ల జారీ ఉండదు. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ ఇది కొనసాగుతుంది. రైల్వేస్టేషన్లలో రద్దీని నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు.
ప్రయాణికులతో పాటు రైల్వేస్టేషన్లకు వచ్చే వారి బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల రాకను నిలిపివేయడంలో భాగంగా ప్లాట్ఫాం టికెట్ల అమ్మకాలను నిలిపివేసినట్లు తెలిపారు. లోక్మాన్య తిలక్ టెర్మినస్, కల్యాణ్, థానె, దాదర్, పన్వెల్, ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్లల్లో ప్లాట్ఫాం టికెట్ల అమ్మకాలను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. తక్షణమే ఇది అమల్లోకి వచ్చిందని స్పష్టం చేశారు. కాగా గురువారం నాడు అధికారులు జారీ చేసిన బులెటిన్ ప్రకారం.. మహారాష్ట్రలో కొత్తగా 56,286 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. 376 మంది మరణించారు. 36,130 వేల మంది రికవరీ అయ్యారు.
Recommended Video
ప్రస్తుతం అక్కడ నమోదైన మొత్తం కేసులు 32,29,547. ఇందులో డిశ్చార్జ్ అయిన పేషెంట్లు 26,49,757 మంది ఉన్నారు. యాక్టివ్ కేసులు 5,21,317గా రికార్డ్ అయ్యాయి. 57,028 మంది ఇప్పటిదాకా మరణించారు. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని అక్కడి ప్రభుత్వం వారాంతపు రోజుల్లో లాక్డౌన్ను విధించింది. ఈ రాత్రి 8 గంటల నుంచి ఇది అమల్లోకి రానుంది. సోమవారం ఉదయం 7 గంటల వరకు కొనసాగుతుంది. వారంలో ఆ నాలుగు రోజుల పాటు సడలింపులు ఉన్నప్పటికీ.. కరోనా నివారణ చర్యలను ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తుంది.