ముస్లి పేరు పెట్టుకుంటే చంపేస్తారా.. బీహార్లో ఇదే జరిగింది..!
తను ముస్లిం పేరు పెట్టుకున్నందుకు గాను ఒక వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటన బీహార్లోని బెగుసరాయ్లో చోటు చేసుకుంది. బాధితుడి ఆవేదనతో కూడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మొహ్మద్ ఖాసిం అనే సేల్స్ మ్యాన్ ఇంటింటికీ సబ్బులను విక్రయిస్తూ ఉంటాడు. జిల్లాలోని కుంభి గ్రామంకు చేరుకోగానే రాజీవ్ అనే ఓ వ్యక్తి ఫుల్గా మద్యం సేవించి తన పేరు ఏమిటని అడిగినట్లు ఖాసిం తెలిపాడు. తన పేరు మొహ్మద్ ఖాసిం అని చెప్పగానే ఖాసింపై దాడి చేసిన రాజీవ్ యాదవ్ తను పాకిస్తాన్కు వెళ్లాల్సిందిగా తనపై కేకలు పెట్టాడని ఆ తర్వాత తనపై కాల్పులు జరిపినట్లు వీడియోలో ఖాసిం చెప్పాడు. రాజీవ్ యాదవ్ పై ఫిర్యాదు చేయడంతో కేసును నమోదు చేశారు పోలీసులు. అయితే అతనిని ఇప్పటి వరకు అరెస్టు చేయలేదు.
తనపై వెనకవైపున కాల్పులు జరగగానే మరోసారి కాల్పులు జరిపేందుకు తుపాకీని లోడ్ చేస్తుండగా రాజీవ్ను పక్కకు నెట్టేసి తాను తప్పించుకున్నట్లు ఖాసిం తెలిపాడు. ఆ సమయంలో తనను కాపాడేందుకు ఎవరూ ముందుకు రాలేదని వారందరినీ తుపాకీతో రాజీవ్ యాదవ్ బెదిరించాడని చెప్పాడు. ముందుగా ఆ గ్రామ పెద్ద వద్దకు వెళితే తన ఫిర్యాదును పట్టించుకోలేదని వెంటనే పోలీస్ స్టేషన్కు పరుగులు తీసినట్లు ఖాసిం తెలిపాడు. ఫిర్యాదు చేసిన తర్వాతే పోలీసులు తనను హాస్పిటల్కు తరలించినట్లు ఖాసిం వెల్లడించాడు.
ఇక గత వారం రోజుల్లో ముస్లింలపై దాడి జరగడం ఇది మూడో సారి కావడం విశేషం. మే 22న ముగ్గురు ముస్లింలపై గోరక్షకులు దాడి చేశారు. ఇక శనివారం ముస్లింలు సంప్రదాయంగా వేసుకునే టోపీని ధరించాడని ఓ వ్యక్తిపై గురుగ్రామ్లో దాడి చేశారు. జైశ్రీరాం అనాల్సిందిగా బలవంతం పెట్టారు. ఈ ఘటనలపై మజ్లిస్ నేత అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. దేశంలో బీజేపీ ప్రభుత్వంలో ముస్లింలపై దాడులు అధికమయ్యాయని ధ్వజమెత్తారు. అంతేకాదు కేవలం ఒక వ్యక్తి తన పేరు చెప్పినందుకే దాడులు జరుగుతున్నాయని దేశంలో ముస్లింలకు రక్షణ కరువవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఓవైసీ. ఒక వ్యక్తిపై దాడి చేసేంత ధైర్యం ఎవరిని చూసుకుని రాజీవ్కు వచ్చింది..? అని ఓవైసీ ప్రశ్నించారు. భారత్లో నివసించే ముస్లింలను పదే పదే పాకిస్తాన్తో అంటగట్టడంతో ఈ తరహా దాడులు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు.