రాజకీయంగా హైజాక్ చేయొద్దు: సీజేపీ నిరసనలపై సల్మాన్ ఖాన్ సంచలన పోస్ట్!
దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళనలపై బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ స్పందించారు. పేపర్ లీక్ నిరసనలకు ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. తానూ ఓ విద్యార్థిగా ఉన్నప్పటి పాత ఫోటోను పంచుకుంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆయన ఓ సుదీర్ఘ సందేశాన్ని పోస్ట్ చేశారు. మెరుగైన విద్యా వ్యవస్థ కోసం దేశంలోని యువత, విద్యార్థులు ఏకం కావడం ఎంతో అభినందనీయమని సల్మాన్ ఖాన్ ప్రశంసించారు.
తన ఇన్స్టాగ్రామ్ రాసిన సందేశంలో సల్మాన్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుతంగా సాగుతున్న ఉద్యమం హఠాత్తుగా హింసాత్మక రూపం దాల్చడం తనను తీవ్రంగా బాధించిందని సల్మాన్ పేర్కొన్నారు. ఈ ఘటనలో గాయపడిన విద్యార్థులకు, వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. పేపర్ లీకేజీ అనేది అత్యంత తీవ్రమైన సమస్య అని ఆయన వెల్లడించారు. విద్యార్థులు విద్యావ్యవస్థ కోసం ఒకే తాటిపైకి రావడం.. వారికి వారి తల్లిదండ్రులు మద్దతుగా నిలవడం చూస్తే ఎంతో సంతోషంగా ఉందన్నారు.

విద్యార్థులు చేస్తున్న ఈ నిరసనలు, వారి పట్టుదల, కష్టపడి చదవాలనే తపన, భవిష్యత్తును అలాగే విద్యావంతమైన ఇండియాను నిర్మించాలనే ఆకాంక్షను స్పష్టంగా చూపుతోందన్నారు. ఈ నిరసనలను విద్యార్థులు శాంతియుత మార్గంలో నిర్వహించారని.. వారు చూపిన ధైర్యం ప్రశంసనీయమన్నారు. విద్య పట్ల ఆసక్తి, ప్రేరణ కలిగిన ఈ తరం భవిష్యత్తులో భారత్ ను గర్వపడేలా చేస్తుందని కొనియాడారు.
ఈ శాంతియుత ఉద్యమాన్ని రాజకీయంగా దుర్వినియోగం చేయొద్దని సల్మాన్ ఖాన్ కోరారు. ఈ సమస్య కేవలం విద్యార్థులకు, విద్యా వ్యవస్థకు మాత్రమే సంబంధించినదని.. దీనిని రాజకీయంగా హైజాక్ చేయొద్దని సూచించారు. ఈ ఉద్యమ ఘనత అంతా విద్యార్థులకే దక్కాలన్నారు. ప్రభుత్వం కూడా విద్యార్థులకు పూర్తి మద్దతు ఇచ్చి.. విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నామన్నారు. చదువుకోవాలనుకునే ప్రతీ ఒక్కరినీ దేవుని ఆశీస్సులు ఉంటాయని సల్మాన్ ఖాన్ రాసుకొచ్చారు. విద్య అనేది తదుపరి ట్రెండ్, ఫ్యాషన్ గా మారాలన్నారు. ఇతర దేశాల నుంచి కూడా విద్యార్థులు చదువుకోవడానికి ఇండియాకు వచ్చేలా మన దేశం ప్రపంచ విద్యా కేంద్రంగా రూపాంతరం చెందాలని సల్మాన్ ఖాన్ పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications