ఆ హీరోలను కలవనివ్వండి లేదా కాల్చేయండి: పాక్ మహిళ
జలంధర్: బాలీవుడ్ సినిమా ‘భజరంగీ భాయిజాన్'లో సల్మాన్ ఖాన్ పొరపాటున భారత్ చేరిన మూగ బాలికను పాకిస్థాన్లోని తల్లిదండ్రుల చెంతకు చేరిస్తే.. తాజాగా పాకిస్థాన్కు చెందిన చందా ఖాన్(27) అనే మహిళ పాకిస్థాన్లోని కరాచీ నుంచి తన అభిమాన బాలీవుడ్ హీరోలు సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్లను చూసేందుకు భారత్ వచ్చేసింది. అది కూడా వీసా, పాస్పోర్ట్ లేకుండానే.
ఒకవైపు గురుదాస్పూర్లో భయోత్పాతం సృష్టించిన సోమవారం నాటి ఉగ్రవాద దాడితో దేశంలో హై అలర్జ్ కొనసాగుతుంటే.. మరోవైపు అనుమానాస్పద స్థితిలో ఆ మహిళ పంజాబ్ రైల్వే స్టేషన్లో దిగింది. దీంతో రాష్ట్ర పోలీసులు, నిఘా విభాగం పరుగులు పెట్టారు. తీరా ఆరా తీస్తే బాలీవుడ్ సూపర్ హీరోలను చూడటానికే ఆమె రైలు ఎక్కేసిందని తెలిసి వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
పాకిస్థాన్కు చెందిన చందా ఖాన్(27) అనే మహిళ.. బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్, కండల వీరుడు సల్మాన్ ఖాన్కి వీరాభిమానట. అందుకే వీసా, పాస్ పోర్టు ఇవేవీ పట్టించుకోలేదు. కనీసం రైలు టికెట్ కూడా తీసుకోకుండానే కరాచీ నుంచి ఢిల్లీకి వెళ్లే సంఝౌతా ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కింది. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు విచారణ అనంతరం ఈ విషయాలు వెలుగు చూశాయి. బాలీవుడ్ హీరోల కోసమే ఇంత పనిచేశానన్న ఆ మహిళ వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు అనంతరం ఆమెను రైల్వే శాఖకు అప్పగించారు. దీనిపై విచారణ కొనసాగుతుందని సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. కాగా, తనకు తన అభిమాన హీరోలను చూపించండి లేదా.. కాల్చేయండి అని ఆ మహిళ పోలీసులతో అన్నట్లు తెలిసింది.