సిగ్గుతో తలదించుకోండి.. శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై రాహుల్ సీరియస్..
ఢిల్లీ : కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ సీరియస్ అయ్యారు. పంజాబ్ ఫతేఘడ్ సాహిబ్లో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఆయన.. 1984 సిక్కుల ఊచకోతపై ఆయన స్పందించిన తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఈ విషయంలో శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు సరికావన్న రాహుల్ ఆయన దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు. '1984 ఘటన గురించి శ్యామ్ పిట్రోడా చేసిన సరికాదు అందుకు ఆయన జాతికి క్షమాపణలు చెప్పాలి. ఇదే విషయాన్ని ఆయనకు ఫోన్ చేసి చెప్పాను. మీరు మాట్లాడింది తప్పు, ఆ వ్యాఖ్యలకు మీరు సిగ్గుపడాలి, బహిరంగ క్షమాపణలు చెప్పాల'న్నానని రాహుల్ స్పష్టం చేశారు.

గతవారం 1984 సిక్కుల ఊచకోతకు ప్రధాని రాజీవ్గాంధీ కార్యాలయం నుంచే ఆదేశాలు వచ్చాయంటూ బీజేపీ చేసిన ట్వీట్పై స్పందిస్తూ శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. అప్పుడేం జరిగిందన్న విషయాన్ని పక్కనబెట్టి ఈ ఐదేళ్లలో ఏం చేశారో దాని గురించి మాట్లాడండని అన్నారు. 1984లో జరిగిందేదో జరిగిపోయింది. అయితే ఇప్పుడేంటి? అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ, శిరోమణి అకాలీదళ్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో రచ్చ అయింది.
పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్రమోడీ ఘాటుగా స్పందించారు. హర్యానాలోని రోహ్తక్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. కాంగ్రెస్ వైఖరి, ఆలోచనా విధానాలకు ఈ వ్యాఖ్యలు నిదర్శనమని అన్నారు. దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ఎంత స్పృహలేకుండా వ్యవహరించిందో అర్థమవుతోందని విమర్శించారు.












Click it and Unblock the Notifications