ఒక్కరోజే 13 లీజులు..! అఖిలేశ్పై సీబీ'ఐ'.. రాజ్యసభలో రచ్చ
లక్నో : ఉత్తరప్రదేశ్ మైనింగ్ అక్రమాల్లో రోజుకో కొత్తకోణం వెలుగుచూస్తోంది. మైనింగ్ లీజు వ్యవహారంలో గలీజు పనులు బయటపడుతున్నాయి. కలెక్టర్ చంద్రకళతో మొదలైన సీబీఐ నజర్.. క్రమంగా మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ వరకు చేరింది. ఆయన చుట్టూ సీబీఐ ఉచ్చు బిగిస్తోంది. అఖిలేశ్ హయాంలో 14 మైనింగ్ లీజులు ఇచ్చినట్లు ఆరోపిస్తోంది.
హమీర్పూర్ జిల్లాలోని మైనింగ్ లీజుల వ్యవహారంలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఈ-టెండర్లలో అఖిలేశ్ అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపిస్తోంది సీబీఐ. 2013, ఫిబ్రవరి 17వ తేదీన ఏకంగా 13 లీజులకు పర్మిషన్ ఇవ్వడం గమనార్హం. 2012-2013 కాలానికి మైనింగ్ శాఖకు ఆయనే మంత్రిగా వ్యవహరించారు. సీఎంగా ఉండి ఆ శాఖను ఎవరికీ కేటాయించకుండా తానే మంత్రిగా ఉన్నారు.
కక్ష్యసాధింపు చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అఖిలేశ్ యాదవ్ ను వేధిస్తోందని మండిపడుతున్నారు సమాజ్వాదీ పార్టీ నేతలు. ఈమేరకు మంగళవారం నాడు రాజ్యసభ్యలో ఆ పార్టీ ఎంపీలు నిరసనగళం వినిపించారు. విపక్షాల ఆందోళనతో సభ కొద్దిసేపు వాయిదాపడింది.