యూపీ లో ఈవీఎం కలకలం - కైరానా లో నెంబరు లేని కారులో : ఎస్పీ కార్యకర్తల గుర్తింపు ..!!
హోరా హోరీగా సాగుతున్న ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో తొలి దశ పోలింగ్ ముగిసింది. తొలి విడత పోలింగ్ లో 60.17 శాతం ఓటింగ్ నమోదైనట్లుగా అధికారులు వెల్లడించారు. గతం కంటే ఇది తక్కువ. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. చాలా చోట్ల ఎలాంటి అవాంతరాలు లేకుండా సాగింది. సాయంత్రం 5 గంటల వరకు 57.79 శాతం ఓటింగ్ నమోదైందని ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. సాంకేతిక కారణాల వల్ల కొన్ని చోట్ల ఈవీఎంలను మార్చినట్లు తెలిపారు.
ఖైరానా అసెంబ్లీ నియోజకవర్గంలోని దుందుఖేడాలో పేద ఓటర్లను పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించలేదన్న సమాజ్వాదీ పార్టీ ఆరోపణలపై విచారణ జరుపుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. అయితే, ఖైరానా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో నెంబరు ప్లేటు లేని కారులో ఈవీఎం మిషన్ ఉండటాన్ని సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలు గుర్తించారు. పాడుబడిన యంత్రం లభ్యమైంది. దీనిని గుర్తించిన సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈవీఎం దొరికిన కారు పైన జోనల్ మెజిస్ట్రేట్ - ఖైరానా అనే స్టిక్కర్ ఉంది. షామ్లీ-పానిపట్ హైవేపై ఈ కారులో ఈవీఎం ఉన్న విషయాన్ని సమాజ్ వాదీ పార్టీ కార్యాకర్తలు గుర్తించి..ఉన్నతాధికారుల వివరణ కోసం డిమాండ్ చేసారు.
ఇది ఎన్నికల నిబంధనల ఉల్లంఘనగా ఆరోపించారు. దీని పైన జిల్లా రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసారు. దీనిని అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. కాగా, తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 58 స్థానాలకు జరిగిన ఈ విడత పోలింగ్లో ఓటర్లు భారీ ఎత్తున తరలి వచ్చారు. అయితే, పలు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. ఫిబ్రవరి, 14న రెండవ దశ, ఫిబ్రవరి 20న మూడవ దశ, ఫిబ్రవరి 23 న నాలుగవ దశ, ఫిబ్రవరి 27వ తేదీన ఐదవ దశ, మార్చ్ 3న ఆరవ దశ, మార్చ్ 7 న ఏడు దశ పోలింగ్ జరగనుంది.
పోలింగ్ జరిగిన 58 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ సరళి పైన ప్రధాన పార్టీలు ఆరా తీస్తున్నాయి. ఎవరికి మెజార్టీ స్థానాలు వచ్చే అవకాశం ఉందనే దాని పైన ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. కాగా, 2017 ఎన్నికల్లో ఇదే 58 స్థానాల్లో బీజేపీ అత్యధిక స్థానాలను గెలుచుకుంది. కానీ, ఈ సారి పోటీ హోరా హోరీగా మారటంతో ప్రతీ అంశాన్ని ప్రధాన పార్టీలు తమకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నం చేస్తున్నాయి. కాగా, మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి