Same Sex marriage: మోడీ సర్కార్ నిర్ణయంపై భగ్గుమంటోన్న స్వలింగ సంపర్కులు: తొక్కేశారంటూ
న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కుల వివాహాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం తాజాగా వెల్లడించిన నిర్ణయం.. దేశవ్యాప్తంగా సరికొత్త ఆందోళనలకు దారి తీస్తున్నట్లు కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై స్వలింగ సంపర్కులు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోన్నారు. స్వలింగ సంపర్కుల వివాహాలు భారత సంస్కృతి, సంప్రదాయాలకు విరుద్ధమని, దాన్ని తాము సమర్థించలేమంటూ కేంద్రం తాజాగా చేసిన ప్రకటన ఎల్జీబీటీక్యూ సమాజంలో కలకలం రేపుతోంది. సాధారణ పౌరులతో సమానంగా తాము పోరాడి సాధించుకున్న హక్కులను కేంద్రం కాలరాస్తోందని మండిపడుతున్నారు.
అసలేంటీ వివాదం..
స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టపరంగా గుర్తించాలంటూ ఢిల్లీ హైకోర్టులో ఓ పిటీషన్ దాఖలైంది. దీన్ని ప్రాథమిక హక్కుగా భావించేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ ఢిల్లీకి చెందిన రాఘవ్ అశ్వతి, ముఖేష్ శర్మ ఈ పిటిషన్ దాఖలు చేశారు. స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేయడానికి, దాన్ని అధికారికంగా గుర్తించడానికి హిందూ వివాహ చట్టంలో సవరణలు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని వారు తమ పిటీషన్లో పేర్కొన్నారు. ఈ పిటీషన్ను ఢిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. తన వైఖరి ఏమిటో తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.
స్వలింగ సంపర్క వివాహాన్ని గుర్తించలేమంటూ
దీనిపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని తెలియజేసింది. స్వలింగ సంపర్కుల వివాహాన్ని ఏరకంగానూ గుర్తించలేమని స్పష్టం చేసింది. తన నిర్ణయాన్ని అఫిడవిట్ రూపంలో ఢిల్లీ హైకోర్టుకు సమర్పించింది. అనంతరం ఢిల్లీ హైకోర్టు.. ఈ పిటీషన్పై విచారణను వచ్చేనెల 20వ తేదీకి వాయిదా వేసింది. కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయడం.. దాన్ని అఫిడవిట్ రూపంలో హైకోర్టుకు సమర్పించడం.. సంచలనంగా మారింది. ఎల్జీబీటీక్యూ అభ్యంతరం వ్యక్తం చేయడానికి కారణమైంది.
ఆ వివాహం సంస్కృతికి వ్యతిరేకం..
పురుషులు, మహిళల మధ్య ఏర్పడే వివాహ బంధానికి మాత్రమే గుర్తింపు ఉందంటూ కేంద్రం స్పష్టం చేసింది. హిందూ వివాహ చట్టం దానికే మద్దతు పలుకుతుందని పేర్కొంది. ఇద్దరు మగవారు లేదా ఇద్దరు ఆడవాళ్ల మధ్య ఏర్పడే వివాహ బంధాన్ని వ్యవస్థ అంగీకరించదని తెలిపింది. దేశ సంస్కృతి, సంప్రదాయాలకు అది పూర్తిగా విరుద్ధమని అఫిడవిట్లో పొందుపరిచింది. హిందూ వివాహ చట్టం గానీ, సమాజం గానీ, ఈ వివాహాన్ని గుర్తించబోదని, ప్రోత్సహించనూ లేదని వెల్లడించింది. హిందూ వివాహ చట్టం సెక్షన్ 5 ప్రకారం అది వ్యతిరేకమని తెలిపింది. ఇదివరకు దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు కేవలం స్వలింగ సంపర్కుల మధ్య శారీరక సంబంధానికి మాత్రమే వర్తిస్తుందని.. వివాహానికి వర్తించదని హైకోర్టు దృష్టికి వివరించింది.
ఎవరు భార్య.. ఎవరు భర్త
స్వలింగ సంపర్కులు వివాహం చేసుకుంటే.. ఎవరిని భార్యగా లేదా భర్తగా గుర్తించాల్సి ఉంటుందని, అది సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఒక పురుషుడిని భర్తగా, మహిళను భార్యగా గుర్తించడానికి లింగపరమైన తేడాలు ఉన్నాయని, అదే స్వలింగ సంపర్కుల విషయంలో ఎలా నిర్ధారించగలమని స్పష్టం చేసింది. పైగా ఈ తరహా వివాహానికి అనుమతి ఇవ్వడం గానీ దాన్ని చట్టపరంగా గుర్తించడమంటూ జరిగితే ఇప్పటికే అమలులో ఉన్న వివాహ చట్టాలకు విలువ ఉండదని, భవిష్యత్తులో అనేక రకాల ఇబ్బందులు వస్తాయని కేంద్రం స్పష్టం చేసింది.
భగ్గుమంటోన్న స్వలింగ సంపర్కులు..
కేంద్రం వైఖరి పట్ల దేశవ్యాప్తంగా లెస్పియన్స్, గే, బైసెక్సువల్స్, ట్రాన్స్జెండర్ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. తోటి పౌరులతో సమానంగా తాము పోరాడి సాధించిన హక్కులను కేంద్రం కాలరాస్తోందని మండిపడుతున్నారు. భారత్లోని స్వలింగ సంపర్క సమాజం ప్రపంచంతో పాటు పోటీ పడి హక్కులను సాధించుకోలేకపోవడానికి కారణం.. ఇక్కడి ప్రభుత్వాలేనంటూ ఆందోళన వ్యక్తం చేస్తోన్నాయి. స్వలింగ సంపర్కులైనంత మాత్రాన వారికి చట్టాలు వర్తించబోవనడం ఎంత మాత్రమూ సరికాదని, చట్టం అందరికీ సమానం కాదని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని హర్షించబోమని అంటోన్నారు.