షాకింగ్ : తమిళనాడులో నరమాంస భక్షణ-ఆ శవం ఎక్కడిది..?-సమియాదీల అరెస్ట్..?
తమిళనాడులో ఓ సంచలన ఘటన వెలుగుచూసింది. నరమాంసం భుజించారన్న ఆరోపణలతో కొంతమంది 'సమియాదీ'లపై కేసు నమోదైంది. ఓ ఆలయంలో జరిగిన వేడుకల్లో చేతిలో మనిషి పుర్రెను పట్టుకొని వీరంతా నృత్యాలు చేయడంతో నరమాంసం తిన్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో స్థానిక అధికారి ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కొంతమంది సమియాదీలను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని విచారిస్తున్నారు.
ఎవరీ సమీయాదీలు...
తమిళనాడులో సమియాదీలు స్వామిజీలుగా చలామణి అవుతున్నారు. తమను తాము స్థానిక దేవతలుగా ప్రకటించుకున్న ఈ సమియాదీలు ప్రజల కష్టనష్టాలకు పరిష్కార మార్గాలు చెబుతుంటారు. చాలామంది ప్రజలు వీరిని ఆశ్రయించి బాధలు చెప్పుకుని పరిష్కారాలు కోరుతుంటారు. ఇటీవల టెన్కాశిలోని కల్లురని అనే గ్రామంలో ఉన్న సుదలై మదస్వామి(కట్టు కోవిల్) ఆలయంలో సమియాదీలు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా చేతిలో మనిషి పుర్రె పట్టుకుని వీరు నృత్యాలు చేశారని... నరమాంసం భుజించారని ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్గా మారిందని చెబుతున్నారు.
పోలీసులే షాక్...
ఆ వైరల్ వీడియో స్థానిక విలేజ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ దృష్టికి రావడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పలువురు సమియాదీలను అరెస్ట్ చేశారు. వేడుకల సందర్భంగా భుజించిన నరమాంసంపై వారిని ప్రశ్నించారు. ఆ శవాన్ని ఎక్కడినుంచి తీసుకొచ్చారని ప్రశ్నించారు. అయితే ఆ సమయంలో ఆలయ దేవత తమలో ప్రవేశించడంతో.. తాము మైమరిచిపోయిన స్థిలో ఉన్నామని... ఏం జరిగిందో తమకూ తెలియదని ఆ సమియాదీలు చెప్పడం గమనార్హం.సమియాదీల మాటలు విని పోలీసులే షాక్ తిన్నారు.
గతంలోనూ ఈ తరహా ఘటనలు...
చుట్టుపక్కల గ్రామాల్లోని ఏదైనా శశ్మాన వాటిక నుంచి సగం కాలిన మనిషి శవాన్ని తీసుకొచ్చి ఉంటారా అని అనుమానిస్తున్నారు. ఆ కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. సమియాదీలు ఇలాంటి వివాదంలో ఇరుక్కోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో 2019లో ఇదే కట్టు కోవిల్ ఆలయంలో జరిగిన వేడుకల సందర్భంగా మనిషి పుర్రె,చేతిని సమియాదీలు తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో కూడా అప్పట్లో వైరల్గా మారింది. వారు ఆరాధించే సుదలై మదస్వామి ఆలయంలో వేడుకల సందర్భంగా... మనిషి శవాల కోసం సమియాదీలు అన్వేషిస్తారని స్థానికులు చెబుతున్నారు. అయితే ఇందులో నిజం లేదన్న వాదన కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.