రవి మృతి: ఇసుక మాఫియాపై డౌట్, తహసీల్దార్పై హత్యాయత్నం
బళ్లారి: ఇసుక మాఫియాకు కళ్లెం వెయ్యడానికి వెళ్లిన అధికారి మీద హత్యాయత్నం జరిగిన సంఘటన కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో జరిగింది. బళ్లారి జిల్లా హువినహడగలి తాలుకా బ్యాలహుణసి గ్రామం సమీపంలో మంగళవారం అర్ధ రాత్రి తహసిల్దార్, సిబ్బంది తృటిలో ప్రాణాల నుండి తప్పించుకున్నారు. ఐఎఎస్ అధికారి డికె రవి అనుమానాస్పద మృతిపై ఇసుక మాఫియా పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్న సమయంలో ఈ హత్యాప్రయత్నం జరిగింది.
బ్యాలహుణసి గ్రామం సమీపంలోని తుంగభద్రా నది తీరంలో మంగళవారం అర్ధ రాత్రి అక్రమంగా ఇసుక వాహనాలలో తరలిస్తున్నారని తహసిల్దార్ హెచ్. విశ్వనాథ్కు సమాచారం అందింది. వెంటనే సిబ్బందిని వెంట పెట్టుకుని జీపులో తుంగభద్రా నది దగ్గరకు వెళ్లారు. ఆ సమయంలో బ్యాలహుణసి నుండి హావేరి వైపు ఇసుక తీసుకు వెలుతున్న కే.ఎ.27-0597 నెంబర్ కలిగిన లారీని నిలపాలని తహసిల్దార్ విశ్వనాథ్ సూచించారు.
అయితే లారీ డ్రైవర్ వాహనం వేగంగా నడిపి విశ్వనాథ్ ఉన్న జీపును ఢీకొట్టడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో జీపు డ్రైవర్ వాహనాన్ని రోడ్డు పక్కన ఉన్న పోలాల్లోకి నడిపించాడు. దాంతో పెద్ద ప్రమాదం తప్పి వారు ప్రాణాలతో బయటపడ్డారు. లారీ డ్రైవర్ వాహనం నిలపకుండా హైవే మీద వేగంగా వెళ్లిపోయాడు. మార్గం మధ్యలో లారీ నిలిపేసి డ్రైవర్ అక్కడి నుండి పరారయ్యాడు. విశ్వనాథ్ నెల క్రితం హువినహడగలి తహసిల్దార్ గా బాధ్యతలు తీసుకున్నారు. గత ఐదు రోజుల నుండి ఇసుక మాఫియా భరతం పట్టి వాహనాలు సీజ్ చేస్తున్నారు.
కొన్ని నెలల క్రితం మండ్య నుండి బెంగళూరు వెళుతున్న ఇసుక లారీని నిలపమని చెప్పిన డీఎస్పీ మీద ఇదే విధంగా ఇసుక లారీ నడిపి హత్యాయత్నం చేశారు. ఐఎఎస్ అధికారి రవి స్యాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియాకు బలి అయ్యారనే అనుమానాలు వ్యక్తమవుతున్న సమయంలో ఈ సంఘటన జరిగింది.