ఆందోళనకారుల ముసుగులో రైలింజన్పై దాడి..ఆరుగురు సంఘ్ పరివార్ వ్యక్తులు అరెస్టు
బెంగాల్ : పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో కొందరు అల్లరిమూకలు చేరి కావాలనే హింసకు పాల్పడుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అనుమానాలు నిజమే అని బెంగాల్లో బుధవారం జరిగిన ఘటన రుజువు చేస్తోంది.బుధవారం రోజున ఆందోళనకారుల ముసుగులో కొందరు సంఘ్ పరివార్ వ్యక్తులు ఓ రైలింజన్పైకి రాళ్లు రువ్వడం కెమెరాల్లో కనిపించింది .వారిని గుర్తించిన పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. మొత్తం ఆరుమంది సంఘపరివార్ కార్యకర్తలు ముఖానికి ముసుగు ధరించి లుంగీలు వేసుకుని రాళ్లు రువ్వారు. వీరిలో ఇద్దరిని బుధవారం ముర్షిదాబాద్లో పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చగా ఐదురోజుల పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలిచ్చింది కోర్టు.
ఆరుగురిలో ముగ్గురు మైనర్లుగా ఉండటంతో వారిని 14రోజుల పాటు జైలుకు పంపాలని ఆదేశాలు ఇచ్చింది కోర్టు. ఇక ఆరో వ్యక్తి ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు. నలుగురు మైనర్లని వారంతా ఇంటర్మీడియెట్ చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ వార్త తెలుసుకున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక సామాజిక వర్గంపై దాడి చేసేందుకు బీజేపీ ఎంత నీచస్థాయికి దిగజారిందో చూడండంటూ మండిపడింది.
ఏబీవీపీకి చెందిన అభిషేక్ సర్కార్ అనే 21 ఏళ్ల యువకుడితో పాటు మరో ఐదుమంది రైల్వే పట్టాల దగ్గర బట్టలు మార్చకుంటున్న దృశ్యాలు కెమెరా కంటికి చిక్కాయి. రాధమదబ్తాలా గ్రామం వద్ద ఉన్న పట్టాల దగ్గర వీరు బట్టలు మార్చుకుని వెళుతున్న రైలింజన్పైకి రాళ్లు రువ్వారు. వీరిని గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరోవైపు పట్టుబడ్డ ఆరుగురికి తమ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గౌరీ శంకర్ ఘోష్ చెప్పారు. మరోవైపు ఈ ఘటనను రికార్డు చేస్తున్న ఏడో వ్యక్తి గ్రామస్తులను చూడగానే పరుగులు తీశాడు.
ఇదిలా ఉంటే తాము ఓ యూట్యూబ్ ఛానెల్ కోసమే ముఖానికి పుర్రె బొమ్మ ఉన్న క్యాప్ను, లుంగీలను ధరించామని చెప్పుకొచ్చారు. అయితే ఆ యూట్యూబ్ ఛానెల్ ఏమిటో చెప్పాల్సిందిగా పోలీసులు కోరగా వారు చెప్పలేకపోయారు. దీంతో అడ్డంగా దొరికారు.