యూపీ సీఎంతో శివసేన నేత సంజయ్ రౌత్ భేటీ...అయోధ్యపై చర్చ
లక్నో: నవంబర్ 25న శివసేన ఛీఫ్ ఉద్దవ్ థాక్రే అయోధ్యను సందర్శిస్తారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ను కలవడం చర్చనీయాశంగా మారింది. రామ మందిరంపై చర్చించేందుకే తాను యోగీతో భేటీ అయినట్లు చెప్పారు. యోగీ ఆదిత్యానాథ్ను ఆయన నివాసంలో సంజయ్ రౌత్ కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
శివసేన ఎప్పటికప్పుడు రామమందిరం అంశాన్ని లేవనెత్తుతూనే ఉందని గుర్తుచేశారు. ఇది దేశంలో నివసిస్తున్న ప్రతి హిందువుకు చాలా ప్రాముఖ్యమైన అంశమన్న రౌత్... ఇదే విషయమై యోగీ ఆదిత్యనాథ్తో చర్చించినట్లు ఆయన చెప్పారు. రామమందిరం నిర్మాణం త్వరగా జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని యోగీ ఆదిత్యనాథ్ కూడా చెప్పారని సంజయ్ వివరించారు. శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే అయోధ్యను సందర్శించేందుకు వస్తుండగా ఆయనకు తగిన భద్రత ఏర్పాటు చేయాల్సిందిగా కూడా యోగీని కోరినట్లు సంజయ్ రౌత్ చెప్పారు.
దసరా సందర్భంగా అక్కడికి కూడి వచ్చిన భక్తులు కార్యకర్తలతో నవంబర్ 25న తను అయోధ్యలోని రామమందిర స్థలాన్ని సందర్శిస్తానని శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే చెప్పారు. ఇప్పటి వరకు రామమందిర నిర్మాణం ఎందుకు చేపట్టలేకపోయారో అనే దానిపై ఆరోజునే కేంద్రం నుంచి స్పష్టత కోరుతానని చెప్పారు. ఒకవేళ రామమందిర నిర్మాణం చేపట్టలేకపోతే కేంద్ర ప్రభుత్వం వెంటనే ఒక ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేతకాకపోతే తామే మందిరాన్ని నిర్మిస్తామని ఉద్దవ్ థాక్రే చెప్పారు. కేవలం అచ్చేదిన్ హామీపైనే బీజేపీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. మిగతాదంతా మాయాజాలమే అని బీజేపీపై నిప్పులు చెరిగారు. రామమందిరం కూడా బీజేపీకి ఒక మాయగానే కనిపిస్తుందా అని ఉద్దవ్ థాక్రే సూటిగా ప్రశ్నించారు.