20 ఏళ్లకు.. గెలిచిందెవరు?: శశికళకు జైలు వెనుక.. ఆ 'ఒక్కడు'
జయలలిత అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ, మరో ఇద్దరికి సుప్రీం కోర్టు మంగళవారం నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది.
చెన్నై: జయలలిత అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ, మరో ఇద్దరికి సుప్రీం కోర్టు మంగళవారం నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. శశికళకు జైలు శిక్ష పడటంతో పన్నీరు సెల్వం వర్గం, శశికళ వ్యతిరేకులలో సంబరాలు వెల్లువిరిశాయి.
శశికళకు రిసార్ట్ ఎమ్మెల్యేల షాక్: జయలలితకు భారతరత్న లేనట్లే!
పన్నీరు సెల్వం మద్దతుదారులు సంబరాలు జరుపుకున్నారు. ప్రతిపక్ష డీఎంకే మిఠాయిలు పంచుకుంది. బీజేపీ సహా పలు పార్టీలు సుప్రీం కోర్టు తీర్పును స్వాగతించాయి. అదే సమయంలో శశికళ వర్గంలో మాత్రం నిరాశ అలుముకుంది. ఆ తర్వాత పలనిస్వామి సీఎం కావడం, పన్నీరు వర్గంలో నిరాశ నెలకొనడం వేరే విషయం.
గెలిచిందెవరు?
పన్నీరు వర్గం, ప్రతిపక్షాలు సంబరాలు జరుపుకున్నా.. శశికళ వర్గం నిస్పృహకు లోనైనా.. వీటన్నింటికి ఒకే ఒక్కడు కారణం. అది బీజేపీ రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి. జయ ఆస్తుల కేసు ఆటలో పన్నీరు, స్టాలిన్లు సంబరాలు చేసుకున్నా.. గెలిచింది మాత్రం సుబ్రహ్మణ్య స్వామి. వారి ఆనందానికి ఆయనే కారణం.
రసవత్తరం
పది రోజుల క్రితం శశికళ అన్నాడీఎంకే శాసన సభా పక్ష నేతగా ఎన్నికయినప్పటి నుంచి తమిళనాట రసవత్తర రాజకీయం కనిపించింది. తొలుత రాజీనామా చేసిన పన్నీరు.. మూడు రోజుల్లోనే రివర్స్ అయ్యారు.
శిక్షకు జై
బెదిరింపులో, నిర్బంధమో.. మొత్తానికి ఎమ్మెల్యేలు శశికళ వైపు ఉన్నారు. కానీ తమిళనాట ఎక్కువ మంది ప్రజలు, సినీ తారలే కాదు.. విపక్షాలు కూడా పన్నీరు వైపు మొగ్గు చూపాయి. మంగళవారం కోర్టు తీర్పును అందరూ స్వాగతించారు.
సుబ్రహ్మణ్య స్వామి
జయ అక్రమాస్తుల కేసుకు కారణం అయిన సుబ్రహ్మణ్య స్వామి కూడా ఈ కేసును స్వాగతించారు. అంతకు ముందు వరకు ఆయన.. శశికళను ముఖ్యమంత్రిని చేయాలని, లేదంటే గవర్నర్కు చెడ్డ పేరు వస్తుందని, అవసరమైతే తాను కోర్టుకు వెళ్తానని చెప్పారు.
శశికళకు స్వామి మద్దతు!
అన్నాడీఎంకే శాసన సభా పక్ష నేతగా ఎన్నికైన కారణంగానే శశికళను సీఎం చేయమని ఆయన చెప్పారు. అలాగే, కోర్టు తీర్పు ఎలాగు ఆమెకు వ్యతిరేకంగా వస్తుందని ఆయన ముందే భావించి ఉంటారు. కాబట్టి తీర్పు వచ్చాక ఎలాగు రాజీనామా చేస్తారు కాబట్టి ఆమెను సీఎంగా చేయమని సూచించి ఉంటారని అంటున్నారు.
సానుభూతి కాదు..
శశికళ మీద సానుభూతితో ఆమెకు మద్దతు పలకలేదని, కోర్టు తీర్పు ఎలాగు వ్యతిరేకంగా వస్తుందనే ఆయన మద్దతు పలికినట్లుగా కనిపిస్తోందంటున్నారు. తీర్పు అనంతరం స్వామి ట్విట్టర్లో.. 20 ఏళ్ల తర్వాత నేను గెలిచానని పేర్కొన్నారు.
స్వామి ఉత్సాహం
'శశికళను సుప్రీం కోర్టు దోషిగా తేల్చడాన్ని సుప్రీం నుంచి నాకు దక్కిన ప్రోత్సాహంగా భావిస్తున్నా. ఈ ఫలితం కోసం 20 ఏళ్లు పోరాడా. ఈ ధర్మాసనం కేసును ఆసాంతం అధ్యయనం చేసి, సవివర తీర్పును వెలువరిస్తుందని నాకు తెలుసు. ఏ పార్టీ అవినీతికి పాల్పడినా, వాటిపై న్యాయస్థానాలు కఠిన వైఖరిని అవలంబిస్తాయి. అవినీతి అనేది సమాజానికి పెద్ద బెడదగా మారిందని జస్టిస్ అమితవ్ రాయ్ పేర్కొన్నందుకు నాకు తృప్తిగా ఉంద'ని స్వామి అన్నారు.
నాడు జయ జైలుకు, నేడు శశికళకు సీఎం పీఠం దూరం
నాడు జయలలిత జైలుకెళ్లినా, నేడు శశికళకు సీఎం పీఠం దూరమైనా.. రెండు దశాబ్దాలుగా తమిళ రాజకీయాల్లో ఎన్నో మలుపులకు కారణం సుబ్రహ్మణ్య స్వామి. 1996లో జయ అక్రమాస్తులపై కేసు వేశారు. 1991 నుంచి 1996 మధ్య సీఎంగా ఉన్న జయ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, రూ.66 కోట్లకు పైగా అక్రమాస్తులు కూడబెట్టారని ఆయన ఆరోపణ. 1996లో జయ తన దత్తపుత్రుడు సుధాకర్్ పెళ్లి కోట్లు కుమ్మరించి కనీవినీ ఎరగని రీతిలో చేయడం ఆమెపై ఆరోపణలకు బలం చేకూర్చింది.
అక్రమాస్తులు
జయలలిత అక్రమాస్తులుగా పేర్కొన్న వాటిలో నీలగిరి కొండల్లో టీ ఎస్టేట్, లగ్జరీ కార్లు, కోట్ల విలువైన ఆభరణాలు, బ్యాంకుల్లో నగదు నిల్వలు ఉన్నాయి.
స్వామి కేసు వేశారు
4 జూన్ 1996లో జయ అక్రమాస్తులపై స్వామి కేసు వేశారు. 18 జూన్ నెలలో జయపై డీఎంకే ప్రభుత్వం ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. 4 జూన్ 1997లో జయ, శశికళ, ఇళవరసి, సుధాకరన్లపై ఛార్జీషీటు దాఖలు చేశారు. 14 మే 2001లో జయ సీఎం అయ్యారు. 28 ఫిబ్రవరి 2003లో కేసు విచారణను తమిళనాడు నుంచి సుప్రీంకు తరలించాలని డీఎంకే పిటిషన్ వేసింది.
కేసు తరలింపు
18 నవంబర్ 2003లో కేసు విచారణను బెంగళూరుకు తరలిస్తూ సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. మార్చి 2005లో కేసు విచారణ ప్రారంభమైంది. 27 సెప్టెంబర్ 2014లో జయ, శశికళ, ఇళవరసి, దినకరన్లను కోర్టు దోషిగా తేల్చింది. వారిని జైలుకు తరలించారు. 29 సెప్టెంబర్ 2014లో జయలలిత బెయిల్ కోసం కర్నాటక హైకోర్టును ఆశ్రయించారు.
జయ కన్నుమూత, శశికళకు శిక్ష
7 అక్టోబర్ 2014లో కోర్టు బెయిల్ పిటిషన్ తిరస్కరించింది. 17 అక్టోబర్ 2014లో జయకు సుప్రీంలో బెయిల్ వచ్చింది. 11 మే 2015లో జయకు వ్యతిరేకంగా సుప్రీంకు కర్నాటక హైకోర్టు అప్పీల్ చేసింది. 23 మే 2016లో జయ తిరిగి అధికారంలోకి వచ్చారు. డిసెంబర్ 5న జయ కన్నుమూశారు. 14 ఫిబ్రవరి 2017లో శశికళను సుప్రీం దోషిగా తేల్చి, శిక్ష ఖరారు చేసింది.
ఆస్తులు ఇలా పోగేసుకున్నారు
1991లో ముఖ్యమంత్రి పదవిని చేపట్టాక.. ఆదాయానికి మించి రూ.66 కోట్ల మేర ఆస్తులను జయలలిత పోగేసుకున్నారని ఇందులో సుబ్రహ్మణ్య స్వామి కేసు వేశారు. 1989-90లో ఆమె తన సంపదను శూన్యంగా ప్రకటించి.. 1990-91 నాటికి రూ.1.89 కోట్లకు దాన్ని పెంచేశారని తెలిపారు. 1992-93లో రూ.5.82 కోట్లు, 1993-94 నాటికి రూ.91.33 కోట్లు, 1993-94లో రూ.38.21 కోట్లను ప్రకటించారని చెప్పారు. ముఖ్యమంత్రి హోదాలో ఆమె నామమాత్రంగా నెలకు రూపాయి వేతనాన్ని మాత్రమే తీసుకున్నారని వివరించారు.
పక్కా ఆధారాలతో..
అవినీతి మకిలి ఎదుర్కొంటున్న రాజకీయ నేతలను కోర్టులు ఈడ్చి ముప్పు తిప్పలుపెట్టి, మూడు చెరువుల నీళ్లు తాగించడంలో సుబ్రహ్మణ్య స్వామి దిట్ట. ఇతర నేతల్లా ఆరోపణలతోనే సరిపెట్టేయకుండా ఆధారాలతో సహా అక్రమాలను బయటపెట్టి, న్యాయపోరాటం చేయటంతో పాటు జైలుశిక్ష పడేంత వరకు పట్టువదలని విక్రమార్కుడిలా ఆయన పని చేస్తారు.
శశికళకు శిక్ష వెనుక
సుబ్రహ్మణ్య స్వామి ప్రముఖ న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా పేరుపొందిన ఆయన కేంద్రమంత్రిగానూ పని చేశారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు సుప్రీంకోర్టు మంగళవారం నాలుగేళ్ల జైలుశిక్ష విధించడం వెనుక సుబ్రమణ్యస్వామి ఉన్నారు.
సోనియాను ఉక్కిరిబిక్కిరి చేశారు
నేషనల్ హెరాల్డ్ కేసుతో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలను ఉక్కిరిబిక్కిరి చేశారు. యూపీఏ ప్రభుత్వాన్ని కుదిపేసిన 2జీ స్పెక్ట్రమ్ వ్యవహారాన్ని కూడా వెలుగులోకి తెచ్చింది ఆయనే. ప్రధాన మంత్రులు, కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు అనేకమందిపై ఆయన న్యాయ పోరాటం చేస్తున్నారు. వీరిలో పలువురు తమ పదవులకు రాజీనామా చేయగా, కొందరు జైళ్లకూ వెళ్లారు.
తమిళనాట నలుగురు జైలుకు
జయ అక్రమాస్తుల కేసు తీర్పుతో సుబ్రహ్మణ్యస్వామి కారణంగా తమిళనాడు నుంచి జైలుకు వెళ్లిన రాజకీయ ప్రముఖుల సంఖ్య నాలుగుకు చేరింది. ప్రస్తుత అక్రమాస్తుల కేసులోనే నాటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జైలుకు వెళ్లాల్సి వచ్చింది. స్పెక్ట్రమ్ కేసులో డీఎంకే నేతలు రాజా, కనిమొళిలు ఊచలు లెక్కపెట్టారు. శశికళ ఇప్పుడు జైలుకు వెళ్తున్నారు.