శశికళ ఫ్యామిలీ రూ. 4. 500 కోట్ల ఆస్తులు సీజ్: బెంగళూరు జైల్లో విచారణ, ప్రత్యేక బృందం!
చెన్నై/బెంగళూరు: ఆదాయానికి మించి అక్రమాస్తులు సంపాధించారని జైలు శిక్ష పడిన వీకే. శశికళ నటరాజన్ ను బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లోనే విచారణ చెయ్యాలని ఆదాయపన్ను శాఖ (ఐటీ శాఖ) అధికారులు నిర్ణయించారు. శశికళ ఫ్యామిలీకి చెందిన రూ. 4.500 కోట్ల ఆస్తులు సీజ్ చేశారు. ఫిబ్రవరి 10వ తేదీ పైన చెన్నైకి చెందిన ఆదాయపన్ను శాఖ అధికారుల ప్రత్యేక బృందం బెంగళూరు జైల్లోనే శశికళను విచారణ చేసి డోల్లా కంపెనీల వ్యవహారం, ప్రభుత్వానికి చెందిన గుట్కా అవినీతికి సంబంధించిన లేఖ ఆమె గదిలోకి ఎలా వచ్చింది అనే వ్యవహారంపై పూర్తి సమాచారం సేకరించడానికి ఆదాయపన్ను శాఖ అధికారులు సిద్దం అయ్యారు.
శశికళ టార్గెట్
శశికళ నటరాజన్ కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని గత ఏడాది నవంబర్ నెలలో ఏకకాలంలో 187 చోట్ల నిర్వహించిన ఐటీ సోదాల వ్యవహారంలో దర్యాప్తు ముమ్మరం అయ్యింది. ఇప్పటికే శశికళ కుటుంబ సభ్యులను విచారించిన ఆదాయపన్ను శాఖ అధికారులు బెంగళూరు జైల్లో చిన్నమ్మను కూడా విచారణ చెయ్యాలని నిర్ణయించారు.
ప్రత్యేక బృందం
శశికళ కుటుంబ సభ్యులను లక్షంగా చేసుకుని చేసిన ఐటీ శాఖ దాడులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆ సందర్భంలో చిక్కిన కీలకపత్రాలు పరిశీలించడం ద్వారా శశికళ కుటుంబ సభ్యులు 50కి పైగా డొల్లా కంపెనీలు నిర్వహిస్తున్నారని వెలుగు చూసింది. డొల్లా కంపెనీల ద్వారా శశికళ కుటుంబ సభ్యులు రూ.1, 430 కోట్ల వరకూ పన్ను ఎగవేశారని ఐటీ శాఖ అధికారులు గుర్తించారు.
Recommended Video
కంపెనీల్లో శశికళ పేరు
శశికళ నటరాజన్ కుటుంబ సభ్యుల డొల్లా కంపెనీల పత్రాల్లో చిన్నమ్మ పేరు ఉండటంతో పన్ను ఎగవేత వ్యవహారంలో ఆమెకూ సంబంధం ఉంటుందని ఆదాయపన్ను శాఖ అధికారులు భావిస్తున్నారు. ఆదాయపన్నుశాఖ అధికారులు శశికళ నటరాజన్ కుటుంబ సభ్యులకు సమన్లు పంపి ఒక్కొక్కరిని విచారిస్తున్నారు.
రూ. 4,500 ఆస్తులు సీజ్
శశికళ నటరాజన్ కుటుంబ సభ్యులకు చెందిన రూ. 4, 500 కోట్ల అక్రమాస్తులను సీజ్ చేశారు. ఆదాయపన్ను శాఖ అధికారులు శశికళ కుటుంబ సభ్యులకు మూడు నెలల్లో సరైన సమాధానం చెప్పాలని నోటీసులు జారీ చేశారు. ఇక శశికళ నటరాజన్ ను విచారణ చేస్తే దర్యాప్తులో ముందడగుపడుతోందని అధికారులు భావిస్తున్నారు.
జయలలిత ఇంటిలో!
పోయెస్ గార్డెన్లోని జయలలిత నివాసంలో ఉన్న శశికళ గదిలో చిక్కిన పెన్డ్రైవ్లు, కంప్యూటర్లలో ఉన్న వివరాలు, హార్డ్ డిస్క్ల్లోని ఆధారాలను శశికళకు స్వయంగా చూపించి విచారించాలని ఆదాయపన్ను శాఖ అధికారులు నిర్ణయించారు.
ప్రభుత్వ సమాచారం
పోయెస్ గార్డెన్ లోని జయలలిత ఇంటిలోని శశికళ గదిలో గుట్కా అవినీతికి సంబంధించిన లేఖ చిక్కింది. ప్రభుత్వానికి సంబంధించిన లేఖ శశికళ గదిలో లభించడంపై కూడా స్పష్టమైన వివరణ తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించిన కీలకమైన లేఖ శశికళ గదిలోకి ఎలా వచ్చిందనే విషయానికి కూడా కచ్చితమైన సమాధానం లభిస్తుందని అధికారులు అంటున్నారు.
శశికళ సమాధానాలు రికార్డు
శశికళ నటరాజన్ విచారణ చేసే సమయంలో ఆమె చెప్పే సమాధానాలు రికార్డు చేసి వాటి ఆధారంగా తరువాత మిగిలిన వారిని విచారణ చెయ్యాలని అధికారులు ఆలోచిస్తున్నారు. ఈ సందర్భంగా ఆదాయపన్ను శాఖ అధికారులు పలు ప్రశ్నలు సిద్ధం చేసుకుంటున్నారు.
మౌనవ్రతం పూర్తి!
బెంగళూరు సెంట్రల్ జైల్లో శశికళ నటరాజన్ మౌనవ్రతం చేస్తున్నారని ఆమె కుటుంబ సభ్యులు చెప్పారు. ఫిబ్రవరి 10వ తేదీ తరువాత శశికళను విచారణ చెయ్యాలని ఆదాయపన్ను శాఖ అధికారులు ఇప్పటికే బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు అధికారులకు లేఖ రాశారు.
సీనియర్ అధికారులు
శశికళను విచారణ చెయ్యడానికి చెన్నైలోని ఆదాయపన్ను శాఖ సీనియర్ అధికారులు సిద్దం అయ్యారు. ఒక్క రోజు, లేదా రెండు రోజుల పాటు శశికళను విచారణ చేసి ఆమె ఇచ్చే సమాధానంతో తరువాత ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని ఆదాయపన్ను శాఖ అధికారులు ఆలోచిస్తున్నారు.