జయ మృతిపై పన్నీరు సంచలనం: శశికళ ఏం చెప్పారంటే...!
జయలలిత మృతిపైన చాలామంది నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో జయ మృతికి సంబంధించి విచారణ చేస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని శశికళ అన్నారు.
చెన్నై: జయలలిత మృతిపైన చాలామంది నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందరి వేళ్లు శశికళ వైపు వెళ్తున్నాయి. తాజాగా, నేతల వ్యాఖ్యలతో జయ మృతికి సంబంధించి మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.
నిన్న స్వయంగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం కూడా జయ మృతిపై అనుమానాలు ఉన్నాయని చెప్పడం సంచలనం కలిగించింది. దీంతో అనుమానాలు మరింత బలపడ్డాయి.
అమ్మ మృతికి సంబంధించి నెలకొన్న అనుమానాలపై హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపిస్తామని పన్నీరు సెల్వం ప్రకటించారు. జయలలిత ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు కలిసేందుకు ప్రయత్నించానని, కానీ శశికళ కలవనీయలేదని చెప్పారు.
బయటకు పంపేందుకే..: శశికళకు పన్నీరు 'పోయెస్ గార్డెన్' ఝలక్
అమ్మ ఆసుపత్రి చేరిన 24 రోజుల తర్వాత తాను ఆరోగ్యం గురించి అడిగానని, జయ బాగనే ఉన్నారని శశికళ తనకు చెప్పారని, తనతో ఆమె అమ్మ ఆరోగ్యం గురించి మాట్లాడటం అదే తొలిసారి అన్నారు. రాజకీయాల పైన ఆసక్తి లేదని జయకు చెప్పిన శశికళ.. ఇప్పుడు ఎందుకు పార్టీని కంట్రోల్లోకి తీసుకోవాలనుంటున్నారని పన్నీరు పాయింట్ లాగారు.
ఈ వ్యాఖ్యలపై ఓ జాతీయ ఛానల్ శశికళతో జరిపిన ఇంటర్వ్యూలో ప్రశ్నించింది. అయితే, ఈ ఆరోపణలను ఆమె కొట్టిపారేశారు. జయలలిత మృతికి సంబంధించి విచారణ చేస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.
శశికళ వద్ద బందీలుగా ఉన్న ఎమ్మెల్యేలను తీసుకు రా: డీజీపీకి పన్నీరు
తాను ఈ విషయంలో భయపడాల్సిన పని లేదని చెప్పారు. తన మీద వస్తున్న అనుమానాలను ఖండించారు. జయలలిత ఆసుపత్రిలో ఉన్న సమయంలో సోదరిలా చూసుకున్నానని, ఆ విషయం తనకు తెలుసని శశికళ చెప్పారు.
తనను ఎలా చూసుకున్నానో జయలలితకు బాగా తెలుసన్నారు. జయలలితను సొంత మనిషి కన్నా ఎక్కువగా చూసుకున్నానని, ఆ విషయం ఆసుపత్రి సిబ్బందిని అడిగితే వివరంగా చెబుతారన్నారు. విచారణకు తాను భయపడాల్సిన పనిలేదన్నారు.
పన్నీరు సెల్వం
కాగా, 2012లో శశికళను, ఆమె బంధువులను జయలలిత పోయెస్ గార్డెన్ నుంచి బయటకు గెంటివేశారు. ఆ సమయంలో తనను క్షమించాలంటూ శశికళ జయలలితకు లేఖ రాశారు. ఇప్పుడు ఆ లేఖను పన్నీర్ సెల్వం బయటపెట్టడం గమనార్హం.
పోయెస్ గార్డెన్
తన బంధువులు, మిత్రులు కొంతమంది నేను పోయెస్ గార్డెన్లో కలిసి ఉంటున్న సమయంలో నా పేరుని వాడుకుని అక్రమాలకు పాల్పడ్డారని, అన్నాడీఎంకేకు చెడ్డపేరు తీసుకొచ్చే విధంగా వ్యవహరించారని, అంతేకాకుండా మీకు (జయలలిత) వ్యతిరేకంగా కుట్రలు కూడా పన్నారని శశికళ ఆ లేఖలో పేర్కొన్నట్లుగా ఉంది.
శశికళ
ఇవన్నీ తనకు తెలియకుండానే జరిగాయని, కలలో కూడా నేను మీకు ద్రోహం తలపెట్టనని, తన బంధువులు అక్రమాలకు పాల్పడ్డారని, ఇది మన్నించరానిదని, తాను మీతో ఉన్నంత మాత్రాన రాజకీయాల్లోకి రావాలని గానీ, పార్టీ పదవులు కట్టబెట్టాలని ఏనాడూ కోరలేదని, అసలు ప్రజా జీవితంలో ప్రవేశించాలన్న ఆశ తనకు రాలేదని, తన జీవితాన్ని మీ కోసమే అర్పించానని పేర్కొన్నారు.
జయలలిత
తనను క్షమించి మళ్లీ దగ్గరకు తీసుకోవాలని ఆ లేఖలో శశికళ పేర్కొన్నారు. కాగా తనకు తెలిసిన విషయాల్లో 10 శాతమే బయటపెట్టానని, ఇంకా 90 శాతం తనలోనే ఉన్నాయని పన్నీర్ సెల్వం చెప్పడం గమనార్హం.