శశికళ పావులు: పార్టీపై కొత్త ఎత్తుగడ, పళనిస్వామి కూడా ఓకే
అన్నాడీఎంకేలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇంకోవైపు పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కున్న శశికళ మాత్రం పార్టీ పైన పట్టు సాధించేందుకు అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు.
చెన్నై: అన్నాడీఎంకేలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇంకోవైపు పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కున్న శశికళ మాత్రం పార్టీ పైన పట్టు సాధించేందుకు అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు.
జైలు నుంచే శశికళ పావులు
అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ జైలు నుంచే పావులు కదుపుతున్నారని అంటున్నారు. శశికళతో పాటు ఆమె కుటుంబాన్ని పార్టీ నుంచి వెలివేస్తే తప్ప విలీనానికి తాము సిద్ధంగా లేమని పన్నీరుసెల్వం వర్గం చెబుతోంది.
చాలా రోజులుగా పళనిస్వామి వర్గం, పన్నీరుసెల్వం వర్గం మధ్య చర్చలు జరుగుతున్నాయి. పన్నీరు వర్గం డిమాండ్ల విషయంలో పళనిస్వామి వర్గం ఆచితూచి స్పందిస్తోంది.
పార్టీపై పట్టు కోల్పోకుండా..
ఇది ఇలా సాగుతుండగానే పార్టీ పైన తన పట్టు కోల్పోకుండా శశికళ వ్యూహాలు రచిస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే పార్టీ గుర్తు కోసం రూ.50 కోట్లకు పైగా ఈసీకి లంచం ఇవ్వబోయి దినకరన్ కూడా అరెస్టయ్యారు.
వివేక్తో భర్తీ..
దీంతో శశికళ తన వదిన (అన్న భార్య) ఇళవరసి కుమారుడు వివేక్తో పార్టీ పదవిని భర్తీ చేయాలని చూస్తున్నారని తెలుస్తోంది. శశికళ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి పళనిస్వామి కూడా ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. శశికళ కుటుంబాన్ని తప్పించాలనుకుంటున్న పన్నీరుకు ఇది షాకే అనవచ్చు. ఈ కారణంగానే పన్నీరువర్గంపై పళని తాజాగా ఘాటు వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.
దినకరన్ స్థానంలో..
శశికళ జైలుకు వెళ్లేముందు టీవీవీ దినకరన్కు పార్టీ పగ్గాలు అప్పగించారు. ఆయనను డిప్యూటీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. దినకరన్ అరెస్టు కావడంతో.. ఆయన స్థానంలో వివేక్కు ఆ బాధ్యతలు అప్పగించాలని శశికళ భావిస్తున్నారని తెలుస్తోంది.