అప్పుడే ఫోటోలు మాయం: 'శశికళ' శకం ఇక కనుమరుగే!?
ఆయన ప్రకటన చేయడమే ఆలస్యం.. తెల్లారేసరికి పార్టీ కార్యాలయంలో చిన్నమ్మ ఫోటోలు మాయమైపోయాయి.
చెన్నై: మంగళవారం అర్థరాత్రి శశికళ, దినకరన్లను అన్నాడీఎంకె పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఆర్థికమంత్రి జయకుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన ప్రకటన చేయడమే ఆలస్యం.. తెల్లారేసరికి పార్టీ కార్యాలయంలో చిన్నమ్మ ఫోటోలు మాయమైపోయాయి.
పార్టీ నుంచి ఆమెను బహిష్కరించిన నేపథ్యంలో.. ఎక్కడా చిన్నమ్మ ఆనవాళ్లు లేకుండా అన్నాడీఎంకె కార్యకర్తలు జాగ్రత్తపడుతున్నారు. సీఎం పళనిస్వామి వర్గానికి చెందిన కొందరు నేతలు ఈ ఫోటోలను తొలగించినట్లు తెలుస్తోంది.

అయితే చిన్నమ్మకు విధేయులైన కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీలో తిరుగబాటు బావుటా ఎగరేయడంతో.. మరోసారి పరిణామాలు ఉత్కంఠకు దారితీస్తున్నాయి. తిరుగుబాటు ఎమ్మెల్యేలు దినకరన్ కు మద్దతు పలుకుతుండటంతో ప్రభుత్వం కూలిపోయే అవకాశం కూడా లేకపోలేదు.
ఈ నేపథ్యంలోనే తిరుగుబాటు ఎమ్మెల్యేలకు నచ్చజెప్పి తమవైపు తిప్పుకునేందుకు పన్నీర్ సెల్వం వర్గం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఎమ్మెల్యేలు గనుక పన్నీర్ వర్గం చర్చలకు తలొగ్గితే.. అన్నాడీఎంకెలో పన్నీర్-చిన్నమ్మ మధ్య చీలిపోయిన రెండు వర్గాలు మళ్లీ ఒకటవడం ఖాయం.
ఒకవేళ తిరుగుబాటు ఎమ్మెల్యేలు పన్నీర్ వర్గం చర్చలకు సానుకూలంగా స్పందించకపోతే మాత్రం పరిస్థితులు ఎటుదారితీస్తాయనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ప్రతిపక్షం డీఎంకె సైతం అప్రమత్తమైంది. పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న స్టాలిన్.. తమకు ఎక్కడా అవకాశం దొరుకుతుందా? అని ఎదురుచూస్తున్నారు.మొత్తం మీద ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో శశికళ ప్రాబల్యం ఇక పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది.












Click it and Unblock the Notifications