శశికళ జైలుకు: గవర్నర్ కు ముందే తెలుసా ? అందుకే ఆలస్యం!
చెన్నై: జయలలిత అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు శిక్షపడుతుందని న్యాయనిపుణల సలహాలు, సూచనల తీసుకున్న గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు సుప్రీం కోర్టు తీర్పు కోసమే ఇన్ని రోజులు అలస్యం చేశారని తెలిసింది.
జయలలిత అక్రమాస్తుల కేసులో మంగళవారం సుప్రీం కోర్టు శశికళ నటరాజన్, ఇళవరసి, దివాకరన్ లకు జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. తక్షణమే శశికళ తదితరులు లొంగిపోవాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు తమిళనాడు రాజకీయ సంక్షోభానికి తెరపడినట్లు అయ్యింది.
బెంగళూరు సెట్రల్ జైలుకు శశికళ: జైలుకు పంపించిన లాయర్ ఈయనే!
ఈనెల 5వ తేదిన ముఖ్యమంత్రి పదవికి పన్నీర్ సెల్వం రాజీనామా చేశారు. రెండు రోజుల తరువాత శశికళ మీద తిరుగుబాటు చేసిన పన్నీర్ సెల్వం తనతో బలవంతంగా రాజీనామా చేయించారని బహిరంగంగా ఆరోపించారు. అప్పటి నుంచి తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
తనకు మెజార్టీ ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారని, తనను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారని, సీఎంగా ప్రమాణస్వీకారం చెయ్యడానికి అవకాశం ఇవ్వాలని శశికళ స్వయంగా గవర్నర్ విద్యాసాగర్ రావును కలిసి మనవి చేశారు. ఈ విషయంపై గవర్నర్ కు రెండు సార్లు లేఖ కూడా రాశారు.
అయితే గవర్నర్ విద్యాసాగర్ రావు నుంచి శశికళకు స్పందన కరువైంది. ఈ పూర్తి వివరాలు బట్టి చూస్తే గవర్నర్ కు జరగబోయే పరిణామాలు ముందే న్యాయనిపుణలు నుంచి తెలుసుకోవడం వలనే ఆలస్యం చేస్తూ వచ్చారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
చిన్నమ్మకు ఝలక్ ఇచ్చిన రాఘవ లారెన్స్: ఆ దమ్ము ఒక్కరికే ఉంది
అంతే కాకుండా గవర్నర్ కేంద్రం సలహాలు తీసుకున్నారనే విషయం తెలిసిందే. గతవారం గవర్నర్ విద్యాసాగర్ రావు మీడియాతో మాట్లాడుతూ శశికళకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో తీర్పు వస్తే తమిళనాడులో మళ్లీ రాజకీయ సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.
పన్నీర్ సెల్వం రాజీనామా చేసిన తరువాత శశికళకు మెజారీ ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చినా అక్రమాస్తుల కేసు తీర్పు వచ్చే వరకు వేచి చూడాలని గవర్నర్ నిర్ణయించారని, శశికళ నిర్దోషిగా బయటకు వచ్చి ఉంటే మాత్రం ఆమె ప్రమాణస్వీకారం చెయ్యడానికి గవర్నర్ కచ్చితంగా అవకాశం ఇచ్చే వారని సీనియర్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సుప్రీం కోర్టు తీర్పు రావాలనే గవర్నర్ ప్రమాణస్వీకారం ఆలస్యం చేస్తూ వచ్చారని సీనియర్ నాయకులు అంటున్నారు. అయితే గవర్నర్ సుప్రీం కోర్టు తీర్పు కోసం వేచి చూడటమే మంచిది అయ్యిందని పలువురు సీనియర్ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.