సత్యమేవ జయతే: ఆర్యన్ ఖాన్ బెయిల్ తిరస్కరణపై ఎన్సిబి సమీర్ వాంఖడే ఆసక్తికర వ్యాఖ్య !!
ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టు ఆర్యన్ ఖాన్ కు బెయిల్ తిరస్కరించింది. ఈ రోజు ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ని కోర్టు కొట్టివేయడంపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వాదనపై సర్వత్రా ఆసక్తి చోటు చేసుకుంది. ఎలాంటి డ్రగ్స్ దొరకని ఆర్యన్ ఖాన్ కు మూడు సార్లు బెయిల్ కోర్టు ఎందుకు నిరాకరించింది అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే ఈ కేసులో వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశం కాగా ఆర్యన్ ఖాన్ బెయిల్ రద్దుపై ఆయన స్పందన తెలుసుకునే ప్రయత్నం చేసిన వారికి ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

సత్యమేవ జయతే .. ఏక వాక్య సమాధానం చెప్పిన సమీర్ వాంఖడే
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సమీర్ వాంఖడేపై ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో పలు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఏకంగా శివసేన మంత్రి కిషోర్ తివారి సమీర్ వాంఖడే పై ఆరోపణలు చేస్తూ ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగిందంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో చోటుచేసుకున్న పలు ఆరోపణలతో సమీర్ వాంఖడే కు పోలీసులు భద్రతను కూడా పెంచారు. ఈ క్రమంలో తాజాగా ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ రద్దు చేయడం పై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నిరాకరించిన సమీర్ వాంఖడే 'సత్యమేవ జయతే' అని ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు.

ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటీషన్ ను తిరస్కరించిన ఎన్డిపిఎస్ ప్రత్యేక కోర్టు
ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ని ఎన్డిపిఎస్ ప్రత్యేక కోర్టు బుధవారం తిరస్కరించింది. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులైన అర్బాజ్ మర్చంట్ మరియు మున్మున్ ధమేచాల బెయిల్ పిటిషన్ లను కూడా ఎన్డిపిఎస్ ప్రత్యేక న్యాయస్థానం తిరస్కరించింది. విచారణ సమయంలో, సీనియర్ న్యాయవాది అమిత్ దేశాయ్, న్యాయవాది సతీష్ మనేషిండేతో కలిసి ఆర్యన్ ఖాన్ తరపున వాదనలు వినిపించారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్స్ (ఎన్డిపిఎస్) చట్టం ప్రకారం ముగ్గురు మాదకద్రవ్యాల అక్రమ రవాణా మరియు నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు అనుమానిస్తూ వారు దాఖలు చేసిన బెయిల్ దరఖాస్తును నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) వ్యతిరేకించింది.

మొదట మేజిస్ట్రేట్ కోర్టులో చుక్కెదురు ... ఇప్పుడు ఎన్డిపిఎస్ కోర్టులో షాక్
ఇంతకుముందు, ఆర్యన్, అర్బాజ్ మర్చంట్ మరియు మున్మున్ ధమేచాకు మెజిస్ట్రేట్ కోర్టు బెయిల్ నిరాకరించింది. ఇది ప్రత్యేక ఎన్డిపిఎస్ కోర్టు ద్వారా విచారించదగిన కేసులో పిటిషన్లను విచారించలేమని చెప్పింది. అంతకుముందు, ఆర్యన్ ఖాన్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో యొక్క ముంబై యూనిట్ యొక్క జోనర్ డైరెక్టర్ సమీర్ వాంఖడేకు ఆర్యన్ ఖాన్ వాగ్దానం చేసినట్టు పేదల కోసం మంచి పనులు చేస్తానని, ఏదో ఒక రోజు గర్వపడేలా చేస్తానని చెప్పినట్టు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వర్గాలు పేర్కొన్నాయి. 23 ఏళ్ల ఆర్యన్ ఖాన్ సమాజంలోని బలహీన వర్గాల ప్రజలకు సహాయం చేస్తానని వాగ్దానం చేశాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆర్యన్ ఖాన్ మంచి వ్యక్తిగా ఉంటానని హామీ ఇచ్చినట్లు ఎన్సిబి వర్గాలు తెలిపాయి.

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు .. దేశ వ్యాప్తంగా చర్చ
సమీర్ వాంఖడే నేతృత్వంలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ముంబై తీరంలో అక్టోబర్ 2 న కార్డెలియా క్రూయిస్ ఎంప్రెస్ షిప్పై దాడి చేసిన తర్వాత ఆర్యన్ ఖాన్ అరెస్టయ్యాడు. ఓడలో రేవ్ పార్టీ, డ్రెస్ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో దాడులు నిర్వహించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ను అరెస్ట్ చేశారు. ఇక అప్పటి నుండి ఈ కేసు రోజుకో రకంగా కీలక మలుపులు తిరుగుతూ కొనసాగుతుంది. అక్టోబర్ 2వ తేదీన ఆర్యన్ ఖాన్ ను అరెస్ట్ చేసిన పోలీసులు, అక్టోబర్ 8వ తేదీన జైలుకు తరలించారు. అప్పటినుండి ముంబై ఆర్థర్ జైల్లో ఆర్యన్ ఖాన్ అండర్ ట్రయల్ ఖైదీగా ఉంటున్నారు. ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం పదేపదే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, బెయిల్ నిరాకరణకు గురికావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications