‘రజినీ అందరి వాడు-రొంపిలోకి లాగొద్దు’
చెన్నై: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కాగా, ఎప్పటిలాగే ప్రస్తుతం అందరి దృష్టి దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ వైపే మళ్లింది. ఏదో ఒక సందర్భంలో ఆయన రాజకీయాలలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా మాట్లాడటమే అందుకు కారణంగా నిలుస్తోంది.
అయితే, రజనీకాంత్ మాత్రం రాజకీయాల్లోకి వచ్చే సూచనలు కన్పించడం లేదు. ఇప్పటికే రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నేతలు చాలా సార్లు రజినీకాంత్ను తమ పార్టీలోకి తీసుకునేందుకు ప్రయత్నించినప్టపికీ ఆయన నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. దీంతో బిజెపి నేతలు ఆయనను ఇబ్బంది పెట్టలేక తమ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.
కాగా, సినిమాలలో రాజకీయాలను తమకు నచ్చినట్లు మలుచుకోవచ్చును కానీ నిజజీవితంలో అది సాధ్యం కాదని, అది పూర్తిగా పతనమయిన రాజకీయాలలో తను ఇమడలేనని, ఇమిడినా వాటిని ప్రక్షాళనం చేయడం తన వలన సాధ్యం కాదనే సంగతి బహుశః రజనీకాంత్ కూడా గ్రహించే ఉంటారు.
అందుకే ప్రతీసారి కూడా 'భగవంతుడి నుంచి ఇంకా ఆదేశం రాలేదు' అంటూ తన నిర్ణయాన్ని వాయిదా వేసుకొంటున్నారు. తమిళనాడులో మళ్ళీ మే 16న శాసనసభ ఎన్నికలు జరుగుతున్నందున మళ్ళీ అందరి దృష్టి ఆయనపైనే పడింది. ఈ ఎన్నికలలో ఆయన ఒంటరిగా పోటీ చేస్తున్న బిజెపికి మద్దతు ఇస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది.
కానీ, ఆయన ఈసారి కూడా ప్రత్యక్ష రాజకీయాలలోకి రావడం లేదని ఆయన సోదరుడు సత్యనారాయణ మీడియాకి స్పష్టం చేశారు. 'రజనీకాంత్ ఏదో ఒక పార్టీకో, వర్గానికో పరిమితం కావాలనుకోవడం లేదు. తమిళనాడు ప్రజలందరూ తనకు కావాలని ఆయన కోరుకొంటున్నారు. అలాగే ఆయన అభిమానులు కూడా ఆయన ఏదో ఒక పార్టీకి పరిమితమయ్యి తమకు దూరం కాకూడదని కోరుకొంటున్నారు' అని సత్యనారాయణ తెలిపారు.
'తన రాష్ట్రం, ప్రజలు బాగుండాలని నా సోదరుడు రజనీకాంత్ కోరుకుంటున్నారు. ప్రజలకి ఎవరికీ ఓట్లు వేయాలో బాగా తెలుసు. వారికి అన్ని విధాలా మేలు చేకూర్చేవారికే వారు ఓట్లు వేసి గెలిపించుకుంటారు. కనుక మధ్యలో నా సోదరుడు వచ్చి కలుగజేసుకోనవసరం లేదు' అని తేల్చి చెప్పారు.
అంతేగాక, 'ప్రజలు తమకు నచ్చిన వారికే ఓట్లు వేసుకోవడం మంచిది. కనుక మీడియా వాళ్ళకి, రజనీ అభిమానులకి నేను చేసే విజ్ఞప్తి ఏమిటంటే ఆయనను ఈ రాజకీయ రొంపిలోకి లాగొద్దు' అని రజనీ సోదరుడు సత్యనారాయణ కృష్ణగిరిలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. దీంతో రజనీకాంత్ ఈ ఎన్నికల్లో కూడా ప్రత్యక్ష రాజకీయాలలోకి రారనే విషయం స్పష్టమైంది.