అది వారికే లాభం, అజహర్పై నిషేధానికి వ్యతిరేకం కాదు, భారత్కు సహకారం: సౌదీఅరేబియా
న్యూఢిల్లీ: పుల్వామా తీవ్రవాద దాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఏర్పడిన సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సౌదీ అరేబియా బుధవారం ప్రకటన చేసింది. సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ పాక్ పర్యటన అనంతరం భారత్కు వచ్చిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. అనంతరం సౌదీ అరేబియా విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది.
భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై తాము కల్పించుకోమని, ఈ విషయంలో కలుగజేసుకోవాలని ఈ ఆ ఇరు దేశాలు తమను సంప్రదించనంత వరకూ తమ వైఖరి తటస్థంగానే ఉంటుందని చెప్పారు. అణ్వస్త్ర శక్తి ఉన్న రెండు దేశాలు ఘర్షణ పడాలని ఎవరూ కోరుకోరని, ఒకవేళ ఘర్షణ జరిగితే ఉగ్రవాదులు తప్ప ఎవరూ లాభపడరని పేర్కొంది. ఈ సమస్యను ఇరుదేశాలు శాంతియుతంగా పరిష్కరించుకుంటాయని తాము ఆశిస్తున్నామని తెలిపింది.
జైష్ ఏ మొహమ్మద్ అధినేత మసూద్ అజహర్ తీవ్రవాది, అలాగే ఆయనపై నిషేధం విధించేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలకు తాము వ్యతిరేకం కాదని తెలిపింది. ఉగ్రవాదులు, ఉగ్రవాదానికి మద్దతు తెలుపుతున్న వారిని యూఎన్ తప్పకుండా గుర్తించాలని ఆ దేశ విదేశాంగ మంత్రి అదెల్ అల్ జుబెయిర్ అన్నారు. ఉగ్రవాదంపై పోరాడేందుకు భారత్కు అండగా ఉంటామని పేర్కొంది. తీవ్రవాది ఎవరైనా వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని సౌదీ పేర్కొంది.
కాగా, జమ్ము కాశ్మీర్లో జరిగిన పుల్వామా ఉగ్రదాడి కేసును కేంద్ర ప్రభుత్వం బుధవారం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు బదిలీ చేసింది. ఈ కేసును రీ రిజిస్టర్ చేసిన ఎన్ఐఏ ఇందులో విచారణ జరిపేందుకు ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఉగ్రవాదుల ప్లాన్, దాడిని నిర్వహించిన తీరును గురించి తేల్చనుందని ఎన్ఐఏ ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఈ ఉగ్రదాడిపై ఇంతకుముందు అవంతిపొర పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. పుల్వామాలో పేలుడు జరిగిన ప్రాంతంలో పోలీసులకు లభ్యమైన పదార్థాలను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. పోలీసులు అరెస్ట్ చేసిన దాదాపు పన్నెండు మందిని విచారిస్తుంది. అలాగే, ఓ సీనియర్ పోలీసు అధికారి, నిఘా, ఆర్మీ అధికారులతో మాట్లాడి, వారి వద్ద ఉన్న ఆధారాలను సేకరించింది.