'నోట్ల రద్దుతో.. క్యూ లైన్లలో 70మంది మృతి..'
నోట్ల రద్దు కారణంగా దేశవ్యాప్తంగా 13రోజుల్లోనే 70మంది ప్రాణాలు కోల్పోయారని రణదీప్ సూర్జివాలా పేర్కొన్నారు.
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎత్తిచూపుతూ.. ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని నిలదీస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సూర్జివాలా మరోసారి ప్రభుత్వంపై మండిపడ్డారు. నోట్ల రద్దు కారణంగా దేశవ్యాప్తంగా 13రోజుల్లోనే 70మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన పేర్కొన్నారు.
బ్యాంకులు, ఏటీఎంలు, పోస్టాఫీసుల ముందు గంటల తరబడి క్యూ లో నిలబడి సామాన్యులు తమ ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశాన్ని ఎన్డీయే ప్రభుత్వం పురోగమనంలోకి తీసుకెళుతుందా? లేక తిరోగమనంలోకి తీసుకెళుతుందా? అని ప్రశ్నించిన ఆయన.. మృతుల కుటుంబాలకు ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. అనాలోచిత నిర్ణయంతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రభుత్వం పలాయనవాదం అవలంభిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు రణదీప్.

ఇక మరో కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ కూడా మోడీపై విరుచుకుపడ్డారు. దేశంలో 86శాతం నగదు నల్లధనం రూపంలో ఉందని ప్రధాని మోడీ చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయని, ఒకవేళ అదే గనుక నిజమైతే.. అంతకుమించిన అవమానకర ప్రకటన మరొకటి ఉండబోదని అభిప్రాయపడ్డారు. చట్టబద్దంగా దాచుకున్న నగదుపై నియంత్రణలు విధించడం ఏమాత్రం సమంజసం కాదని తెలిపారు.












Click it and Unblock the Notifications