ప్రపంచ టాప్-50 బ్యాంకుల జాబితాలోకి.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
అయిదు బ్యాంకుల విలీనంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ప్రపంచంలోనే టాప్-50 బ్యాంకుల జాబితాలో చోటు సంపాదించేసింది.
న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ప్రపంచంలోనే అతిపెద్ద టాప్-50 బ్యాంకుల్లో ఒకటిగా చోటు దక్కించుకుంది.
2017 ఏప్రిల్ 1 తనకు చరిత్రలో నిలిచిపోయే విధంగా అనుబంధ బ్యాంకులు ఐదింటినీ నేడు తనలో విలీనం చేసుకునే ప్రక్రియ ప్రారంభించేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్ కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా లను నేటి నుంచి తనలో విలీనం చేసుకుంటున్నట్లు ఎస్బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది.
భారతీయ మహిళా బ్యంాకు విలీనాన్ని ప్రభుత్వం అంతకుముందే చేపట్టింది. ఈ విలీనంతో ఆస్తుల పరంగా టాప్-50 గ్లోబల్ బ్యాంకుల్లో ఒకటిగా చోటు దక్కించుకోబోతున్నట్లు పేర్కొంది. ఈ ప్రక్రియతో 37 కోట్ల వినియోగదారులు, దాదాపు 24 వేల బ్రాంచిల నెట్ వర్క్, సుమారు 59 వేల ఏటీఎంలు కలిగిన బ్యాంకుగా ఎస్బీఐ అవతరించబోతోంది.
2008లో మొదటిసారి ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్రను తనలో వీలీనం చేసుకుంది. రెండేళ్ల తరువాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్ ను కూడా కలిపేసుకుంది. ఈ విలీనం ప్రక్రియలో పూర్తిగా అన్ని వ్యవస్థలను ఏకీకృతం చేసుకోవడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కనీసం రెండు నెలల సమయం పడుతుందట.