కేంద్రానికి తలంటేస్తున్న సుప్రీంకోర్టు-ఎన్నికల కమిషనర్లకు స్వయంప్రతిపత్తి ఉండాల్సిందే !
దేశంలో ఎన్నికల కమిషనర్ల నియామకానికి అనుసరిస్తున్న విధానంపై సుప్రీంకోర్టు కేంద్రంపై కొరడా ఝళిపిస్తోంది. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్నా ఎన్నికల కమిషనర్ల నియామకానికి సరైన విధానం అమలు చేయడంలో కేంద్రం ఉద్దేశపూర్వకంగానే విఫలమవుతోందని ఇప్పటికే చీవాట్లు పెట్టిన సుప్రీంకోర్టు ఇవాళ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
జస్టిస్ కేఎం జోసఫ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు బెంచ్ .. ఎన్నికల కమిషనర్ల నియామకం విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై నిప్పులు చెరిగింది. ఎన్నికల కమిషనర్లకు స్వయం ప్రతిపత్తి అవసరమని, స్వతంత్రులుగా ఉండే వ్యక్తుల్ని నియమించకపోతే అది ఎలా సాధ్యమవుతుందని కేంద్రాన్ని ప్రశ్నించింది. కానీ కేంద్రం మాత్రం ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని సమర్ధించుకుంది. ఇందులో తప్పుబట్టడానికి ఏమీ లేదని పేర్కొంది. ఎన్నికల కమిషనర్ల నియామకంలో కోర్టులు జోక్యం చేసుకోలేవని తెలిపింది.

1991 నుంచి ఎన్నికల కమిషనర్ను నియమించేటప్పుడు సరైన ప్రక్రియను అనుసరించలేదని ఎలాంటి ఫిర్యాదులు లేవని, నియామక వ్యవస్ధలో ఇప్పటికే సరిచూసే విధానం ఉందని వాదించింది. కొత్త వ్యవస్థను లేదా సిఫార్సు చేసే సంస్థను సృష్టించడం వల్ల మనం తిరిగి ఆరంభానికే వెళతామని సుప్రీంకోర్టులో వాదించింది. దీనిపై స్పందించిన సుప్రీం ధర్మాసనం.. ప్రతీ ప్రభుత్వం తన మాట అమలు చేసే వ్యక్తుల్నే కమిషనర్లుగా నియమిస్తుందని, అటువంటప్పుడు వారు స్వతంత్రంగా పనిచేస్తారా లేదా అన్నది కీలకమని పేర్కొంది.
ఈసీ కేంద్రం ఇచ్చే నిధులతో పనిచేస్తుందన్న వాదననూ సుప్రీంకోర్టు అంగీకరించలేదు. అలాగైతే కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ఈసీకి చెల్లింపులు చేసే ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ విషయంపై పార్లమెంటు ఓ నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. ఎన్నికల కమిషనర్ గా నియామకం చేసే రెండు రోజుల ముందు సదరు అధికారి వీఆర్ఎస్ తీసుకోవడం పారదర్శక విధానమేనా అని కేంద్రాన్ని సుప్రీంకోర్టు నిలదీసింది. ఇది సంప్రదాయంగా వస్తున్నదేనని, చర్చల ద్వారానే ఇది జరుగుతోందని కేంద్రం సమాధానమిచ్చింది. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు తాజాగా వీఆర్ఎస్ తీసుకున్న తర్వాత రోజే కేంద్రం నియమించిన అరుణ్ గోయల్ వివరాలు ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది.












Click it and Unblock the Notifications