వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై దాఖలైన రివ్యూ పిటిషన్ విచారణ చేసేందుకు సుప్రీం అంగీకారం
వీవీప్యాట్ల లెక్కింపుపై సుప్రీంకోర్టులో దాఖలైన రివ్యూపిటషన్ను విచారణ చేసేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ప్రతినియోజకవర్గంలో 50శాతం వీవీప్యాట్ల స్లిప్పులు లెక్కించాలని ఆదేశాలు ఇవ్వాలని దేశంలోని 21 పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారణ చేసిన సుప్రీంకోర్టు ప్రతి నియోజకవర్గంలో ఐదు వీవీప్యాట్ స్లిప్పులను ఈవీఎంలతో సరిపోల్చాలని తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పుతో సంతృప్తి చెందని 21 పార్టీలు తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేశాయి.
ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నందున ఈ అంశంపై త్వరగా విచారణ చేయాలని ప్రతిపక్షాల తరపున న్యాయవాది అభిషేక్ సింఘ్వీ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ పిటిషన్ను వచ్చే వారం విచారణ చేస్తామని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తెలిపారు. ఇదిలా ఉంటే వీవీప్యాట్లలో 50శాతం స్లిప్పులను లెక్కించాలంటే ఫలితాలు వెలువడేందుకు సమయం ఎక్కువగా తీసుకోవడంతో పాటు సిబ్బంది కూడా ఎక్కువ అవుతారని ఎన్నికల సంఘం అంతకుముందు అంటే ఏప్రిల్ 8న జరిగిన వాదనల సందర్భంగా కోర్టుకు తెలిపింది.
ఏప్రిల్ 8న జరిగిన వాదనల్లో ఈవీఎంలను ట్యాపరింగ్ చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చాయి విపక్ష పార్టీలు. పారదర్శకతతో వ్యవహిరించాలన్న తమ డిమాండ్ను ఈసీ పట్టించుకోవడం లేదని విపక్షాలు కోర్టుకు ఫిర్యాదు చేశాయి. పిటిషన్ దాఖలు చేసిన వారిలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, శరద్ పవార్, కేసీ వేణుగోపాల్, డెరెక్ ఒబ్రెయిన్, శరద్ యాదవ్, అఖిలేష్ యాదవ్, సతీష్ చంద్ర మిశ్రా, ఎంకే స్టాలిన్, టీకే రంగరాజన్, మనోజ్ కే ఝా, ఫరూక్ అబ్దుల్లా, ఎస్ ఎస్ రెడ్డి, దనీష్ అలీ, అజిత్ సింగ్, మహ్మద్ బద్రుద్దీన్ అజ్మల్, జితిన్ రామ్ మాంజీలు ఉన్నారు.