ప్రభుత్వాలతో లాభం లేదు: రంగంలోకి సుప్రీంకోర్టు- ఆక్సిజన్ సరఫరాకు టాస్క్ఫోర్స్ ఏర్పాటు
ఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ప్రభుత్వంపై ఎన్నో విమర్శలు వస్తున్నాయి. ఆక్సిజన్ కొరతతో కొందరు మరణిస్తుండగా అత్యవసర మందులు దొరక్క మరికొందరు మరణిస్తున్నారు. ఇప్పటికే గత కొద్దిరోజులుగా దేశంలో కోవిడ్ పరిస్థితిపై విచారణ చేస్తోన్న సుప్రీంకోర్టు ఆక్సిజన్, అత్యవసర మందుల సరఫరాకు జాతీయస్థాయిలో 12 మందితో కూడిన టాస్క్ఫోర్సును ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా ఎక్కడ ఆక్సిజన్ కొరత ఏర్పడిన లేదా అత్యవసర మందులు కొరత ఏర్పడినా ఈ బృందం వెంటనే రంగంలోకి దిగి అవి సకాలంలో చేరేలా చర్యలు తీసుకుంటుంది.
ఆక్సిజన్ సరఫరా, అత్యవసర మందుల సరఫరాకు 12మంది సభ్యులతో జాతీయ టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు వారి హక్కులను కూడా వివరించింది. కేంద్రప్రభుత్వంలో పనిచేసే ఉన్నతాధికారులను ఈ కార్యక్రమంకు వినియోగించుకునే స్వాతంత్ర్యం ఉందని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు వారంతా ఎలా పనిచేయాలి ఎక్కడ పనిచేయాలి అనే నిర్ణయం కూడా ఈ బృందం తీసుకుంటుందని అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది.
ప్రస్తుతం కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో జాతీయ స్థాయిలో టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయాల్సి వచ్చిందని పేర్కొంది. ఆరోగ్య వ్యవస్థలో శాస్త్రీయపరమైన ఆధారాలతో ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకే టాస్క్ఫోర్స్ను నియమించాల్సి వచ్చిందని సుప్రీంకోర్టు పేర్కొంది.
12 మంది సభ్యులతో కూడిన టాస్క్ఫోర్స్ ఇదే..!
డాక్టర్ భభతోష్ బిస్వాస్, మాజీ వైస్ ఛాన్సెలర్ వెస్ట్ బెంగాల్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కోల్కతా
డాక్టర్ దేవేంద్ర సింగ్ రాణా, ఛైర్పర్సన్, బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ , సర్ గంగారాం హాస్పిటల్ , ఢిల్లీ
డాక్టర్ దేవి ప్రసాద్ శెట్టి, ఛైర్పర్సన్ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, నారాయణ హెల్త్కేర్ బెంగళూరు
డాక్టర్ గగన్దీప్ కంగ్, ప్రొఫెసర్, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్, వేలూరు, తమిళనాడు
డాక్టర్ జేవీ పీటర్, డైరెక్టర్, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్, వేలూరు, తమిళనాడు
డాక్టర్ నరేష్ ట్రెహాన్, ఛైర్పర్సన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, మేదాంత హాస్పిటల్ అండ్ హార్ట్ ఇన్స్టిట్యూట్, గురుగ్రామ్
డాక్టర్ రాహుల్ పండిట్, డైరెక్టర్, క్రిటికల్ కేర్ మెడిసిన్ మరియు ఐసీయూ, ఫోర్టిస్ హాస్పిటల్ ములుంద్, ముంబై
డాక్టర్ సౌమిత్ర రావత్, ఛైర్మెన్ మరియు హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటెరాలజీ అండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్, సర్ గంగారామ్ హాస్పిటల్, ఢిల్లీ
డాక్టర్ శివ్ కుమార్ సరిన్, సీనియర్ ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ హెపటాలజీ, డైరెక్టర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్, అండ్ బిలియరీ సైన్సెస్, ఢిల్లీ
డాక్టర్ జరీర్ ఎఫ్ ఉద్వదియా, కన్సల్టెంట్ అండ్ చెస్ట్ ఫిజీషియన్, హిందూజా హాస్పిటల్, బ్రీచ్ కాండీ హాస్పిటల్ మరియు పార్సీ జనరల్ హాస్పిటల్, ముంబై
సెక్రటరీ, కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమం (ఎక్స్ అఫీషియో మెంబర్)
కేబినెట్ సెక్రటరీ నేషనల్ టాస్క్ఫోర్స్కు కన్వీనర్గా వ్యవహరిస్తారు. ఒకవేళ ఈయన అందుబాటులో లేని సమయంలో అడిషనల్ సెక్రటరీ ర్యాంక్ స్థాయిలో మరో అధికారిని నియమించొచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది.