మాల్యా అప్పీల్: బ్యాంకులకు సుప్రీం కోర్టు ఆదేశాలు
న్యూఢిల్లీ: కోర్టు ధిక్కార చర్యల నోటీసులను రీకాల్ చెయ్యాలని విజయ్ మాల్యా నమోదు చేసిన అప్పీల్ పై బ్యాంకుల కన్సార్టియం ఎస్ బీఐ స్పందించాలని సుప్రీం కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది.
సుప్రీం కోర్టు ఆదేశించినా విజయ్ మాల్యా తన ఆస్తుల వివరాలు వెల్లడించలేదని, ఆయన మీద కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని బ్యాంకుల కన్సార్టియం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ పిటిషన్ పై లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు నోటీసులు జారీ అయ్యాయి. ఆ నోటీసులను రీకాల్ చెయ్యాలని విజయ్ మాల్యా అప్పీల్ కు వెళ్లారు. ఈ అప్పీల్ పై ఎస్ బీఐ 10 రోజుల్లో స్పందించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.
ఈ అప్పీల్ విచారణను 2016 సెప్టెంబర్ 27కు సుప్రీం కోర్టు వాయిదా వేసింది. విజయ్ మాల్యా తన ఆస్తుల వివరాలు వెల్లడించి రుణ బకాయిల సెటిల్ మెంట్ కు ప్రయత్నించారని, కానీ ఎలాంటి సెటిల్ మెంట్ కుదరలేదని లిక్కర్ కింగ్ న్యాయవాది మహేశ్ అగర్వాల్ కోర్టులో వాదించారు.
కోర్టు ధిక్కారణకు విజయ్ మాల్యా పాల్పడలేదని పేర్కొన్నారు. రూ. 9 వేల కోట్ల రుణాల ఎగవేత కేసు నుంచి తప్పించుకోవడానికి రూ. 4 వేల కోట్లు బ్యాంకులకు చెల్లిస్తానని విజయ్ మాల్యా ఇప్పటికే అంగీకరించిన విషయం తెలిసిందే.
ఈ ప్రతిపాదనను బ్యాంకులు తిరస్కరించడంతో గత ఏప్రిల్ లో ఆస్తుల వివరాలు తెలియజేయాలని విజయ్ మాల్యాకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ప్రస్తుతం బ్రిటన్ లో తలదాచుకుంటున్నారు.