నోట్ల రద్దు చట్టవిరుద్ధం, కేంద్రం చేయాల్సింది కాదు- సుప్రీం తీర్పుతో విభేదిస్తూ జడ్డి నాగరత్న..
2016లో కేంద్రం చేపట్టిన నోట్ల రద్దు నిర్ణయం సక్రమమేనని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇవాళ తేల్చిచెప్పేసింది. కేంద్రం అప్పట్లో నోట్ల రద్దు కోసం జారీ చేసిన నోటిఫికేషన్ ను బెంచ్ లోని ఐదుగురు సభ్యులు 4-1 మెజారిటీతో ఆమోదించారు. అయితే సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనంలో తన తోటి జడ్డిల అభిప్రాయంతో ఐదో న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న విభేదించారు. కేంద్రం అప్పట్లో తీసుకున్న నిర్ణయంపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.
నోట్ల రద్దుపై తీర్పు ప్రకటించిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనంలో ఉన్న జస్టిస్ నాగరత్న.. నోట్ల రద్దుపై ప్రభుత్వ నోటిఫికేషన్ "చట్టవిరుద్ధం", నోట్ల రద్దు ప్రక్రియను కేంద్రం చేయాల్సింది కాదని అభిప్రాయపడ్డారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం, ఆర్బీఐ యొక్క సెంట్రల్ బోర్డ్ స్వతంత్రంగా నోట్ల రద్దును సిఫారసు చేయాల్సి ఉండగా.. అలా జరగలేదని ఆమె పేర్కొన్నారు. అలాగే నోటిఫికేషన్ను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన పిటిషనర్ వాదనలతో ఆమె ఏకీభవించారు. అప్పట్లో కేంద్రం ఈ నోటిఫికేషన్ జారీ చేయాల్సింది కాదని, కేంద్రం సూచనను ఆర్బీఐ పట్టించుకోవాల్సిన అవసరం లేదని జస్టిస్ నాగరత్న తెలిపారు. కానీ ఇప్పుడు దాన్ని మార్చలేమన్నారు. దీన్ని అమలు చేసిన విధానం చట్టానికి అనుగుణంగా లేదని ఆమె తెలిపారు.
గతంలో జరిగినట్లుగానే నోట్ల రద్దును పార్లమెంటు చట్టం ద్వారా చేపట్టవచ్చని, కార్యనిర్వాహక నోటిఫికేషన్ ద్వారా కాదని జస్టిస్ నాగరత్న అభిప్రాయపడ్డారు. కేంద్రం, ఆర్బీఐ సమర్పించిన పత్రాలు, రికార్డులను పరిశీలించిన తర్వాత, "కేంద్ర ప్రభుత్వం కోరుకున్నట్లు" వంటి పదబంధాలు ఆర్బిఐకి స్వతంత్రంగా వర్తించలేదని చూపుతున్నాయి" అని జస్టిస్ నాగరత్న అన్నారు.