50 లక్షలు, ప్రభుత్వోద్యోగం..! గుజరాత్ అల్లర్ల కేసులో సుప్రీంకోర్టు తీర్పు
ఢిల్లీ : ఒకటి కాదు, రెండు కాదు.. సరిగ్గా 17 ఏళ్లవుతోంది. 2002 నాటి కేసులో బాధితురాలికి ఇప్పుడు న్యాయం జరగబోతోంది. అప్పటి గుజరాత్ అల్లర్ల కేసుకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు మంగళవారం నాడు కీలక తీర్పు వెలువరించింది. గ్యాంగ్ రేప్ కు గురైన బిల్కిస్ బానోకు 50 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలంటూ గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాదు ఆమె తన కాళ్లమీద తాను నిలబడేందుకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని పేర్కొంది. అలాగే రూల్స్ అనుసరించి, ఆశ్రయం కూడా కల్పించాలని సూచించింది సర్వోన్నత న్యాయస్థానం.
కేసు పూర్వపరాలు :
2002 నాటి గోద్రా అల్లర్ల అనంతరం మార్చి 3వ తేదీన అల్లరిమూకల చేతిలో బిల్కిస్ బానో కుటుంబం తీవ్రదాడికి గురైంది. ఆమె కుటుంబంలో మొత్తం 14 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఆ సమయంలో బిల్కిస్ బానో 5 నెలల గర్భిణి. ఆమె కుటుంబ సభ్యులను చంపి బీభత్సం సృష్టించిన అల్లరిమూకల కన్ను బిల్కిస్ బానోపై పడ్డాయి. ఆమెను అమానవీయంగా గ్యాంగ్ రేప్ చేశారు. ఆ దాడి నుంచి కోలుకున్న తర్వాత జాతీయ మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు బిల్కిస్ బానో. అంతేకాదు సర్వోన్నత న్యాయస్థానంలో కూడా పిటిషన్ వేశారు.

జరిగిన ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలంటూ సీబీఐ విచారణకు ఆదేశించింది సుప్రీంకోర్టు. అయితే ఈ కేసుకు సంబంధించి తొలుత అహ్మదాబాద్ లో విచారణ జరిగింది. అయితే బిల్కిస్ బానోకు బెదిరింపులు ఎక్కువ కావడంతో.. 2004లో ముంబై హైకోర్టుకు ఈ కేసును బదిలీ చేసింది సుప్రీంకోర్టు. అయితే 2017, మే 4వ తేదీన ముంబై హైకోర్టు తీర్పు వెలువరించింది. విధులు సక్రమంగా నిర్వర్తించలేదని, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారనే కారణాలతో ఏడుగురు వ్యక్తులను దోషులుగా ప్రకటించింది. అందులో ఐదుగురు పోలీసులు, ఇద్దరు వైద్యులు ఉండటం గమనార్హం. ఏళ్లకొద్దీ విచారణ జరిగిన ఈ కేసులో తాజాగా సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది.












Click it and Unblock the Notifications