జీవిత ఖైదీలను ముందే వదలొద్దు: రాష్ట్రాలకు సుప్రీం
న్యూఢిల్లీ: యావజ్జీవ శిక్షను అనుభవిస్తున్న ఖైదీలను శిక్షాకాలం పూర్తికాకముందే విడుదల చేయవద్దని సుప్రీంకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదును అనుభవిస్తున్న ఏడుగురు ఖైదీలను వారి జైలు శిక్షలను తగ్గించి విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ మధ్యంత ఆదేశాలు ఇచ్చింది.
సిబిఐ దర్యాప్తు చేసిన కేసుల్లో దోషులుగా నిర్ధారణ అయి జీవిత ఖైదును అనుభవిస్తున్న ఖైదీలను విడుదల చేసే ముందు కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవడం అవసరమన్న కేంద్రం వాదనపై తమ అభిప్రాయాలను తెలియజేయాలంటూ సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలకు నోటీసులు కూడా జారీ చేసింది.

ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎం లోధా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఈ ఉత్తర్వులు ఇచ్చింది. రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదును అనుభవిస్తున్న మొత్తం ఏడుగురు ఖైదీలను విడుదల చేయాలని తమిళనాడులోని జయలలిత ప్రభుత్వం గత ఫిబ్రవరిలో నిర్ణయించడం తెలిసిందే.
అప్పుడు అధికారంలో ఉన్న యుపిఏ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేసింది. నరేంద్ర మోడీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం కూడా ఇంతకు ముందు ప్రభుత్వం చేసిన వాదననే పునరుద్ఘాటించింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ వాదిస్తూ.. దేశవ్యాప్తంగా ఖైదీలను వారి శిక్షాకాలం పూర్తికాక ముందే విడుదల చేస్తున్నారని, అందువల్ల దీనిపై సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలకు నోటీసులు జారీ చేయాలని కోరారు. జులై 18 నాటికి తమ సమాధానాలను తెలియజేయాలని ధర్మాసనం రాష్ట్రాలను ఆదేశించింది. కేసు తదుపరి విచారణ జులై 22న జరుగుతుంది.












Click it and Unblock the Notifications